WhatsApp Image 2024 02 26 at 19.52.23
- నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి
విశాఖపట్నం ఫిబ్రవరి 26:: వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను ఉపయోగించి విశాఖ నగరంలో కాలుష్యాన్ని అరికట్టేందుకు నగర ప్రజలు సహకరించాలని నగర మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. సోమవారం ఆమె తమ క్యాంపు కార్యాలయం నుండి జివిఎంసికి ప్రజా రవాణా అయిన ఏపీఎస్ఆర్టీసీ బస్సులో చేరుకోగా జివిఎంసి కమీషనర్ సిఎం.సాయికాంత్ వర్మ తమ క్యాంపు కార్యాలయం నుండి సైకిల్ పై జివిఎంసి కి చేరుకొని అందరికీ స్ఫూర్తినిచ్చారు.
ఈ సందర్భంగా వారిరువురు మాట్లాడుతూ, నగరంలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోతున్న దృష్ట్యా కాలుష్య నియంత్రణకు జివిఎంసి యంత్రాంగం వారంలో ఒకరోజు ప్రజా రవాణాలను ఉపయోగించే నిర్ణయం మేరకు జివిఎంసి ఉద్యోగులతో పాటు అందరము ప్రజా రవాణాలను ఉపయోగిస్తున్నామన్నారు. ఎకో-వైజాగ్ అభివృద్ధి నేపద్యంలో ఎకో-జీరో పొల్యూషన్ కార్యక్రమాలలో భాగంగా నగరంలో పర్యావరణ పరిరక్షణకు కాలుష్య నియంత్రణకు జివిఎంసి అనేక అవగాహనపరమైన చర్యలు చేపడుతుందన్నారు. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, కళాశాలల యాజమాన్యం, పరిశ్రమల యాజమాన్యాలు, స్వచ్ఛంద సంస్థలు, నగర ప్రజలు సహకరించి వారంలో ఒక్కరోజు ప్రజా రవాణాను వ్యవస్థను ఉపయోగించడం వలన విశాఖ నగరంలో కాలుష్య నియంత్రణను పూర్తిగా నియంత్రించుటకు అందరూ సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు