TRINETHRAM NEWS

అస్సాంలో ఆలయ ప్రవేశానికి రాహుల్‌కు అనుమతి నిరాకరణ.. ఆరోపించిన అగ్రనేత

గువహటి: ‘భారత్‌ జోడో న్యాయ యాత్ర (Bharat Jodo Nyay Yatra)’లో భాగంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi) ప్రస్తుతం అస్సాంలో పర్యటిస్తున్నారు..

ఈ క్రమంలో సోమవారం నగావ్‌ జిల్లాలోని బతద్రవ సత్ర ఆలయాన్ని సందర్శించకుండా అధికారులు అడ్డుకున్నారని రాహుల్ ఆరోపించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఆయన.. తనను అడ్డుకోవడానికి గల కారణమేంటని సిబ్బందిని ప్రశ్నించారు. గుడిలోకి ఎవరు ప్రవేశించాలనేది ఇప్పుడు ప్రధాని మోదీ నిర్ణయిస్తున్నారని విమర్శలు చేశారు..

‘మేం ఆలయాన్ని దర్శించుకోవాలనుకున్నాం. ఇక్కడకు రాకూడనంత నేరం నేనేమీ చేశాను..? మేం ఇక్కడకు వచ్చింది ప్రార్థించడానికి.. ఎలాంటి సమస్యలు సృష్టించడానికి కాదు’ అని రాహుల్ మీడియాతో మాట్లాడారు. ఇదిలా ఉండగా.. తన యాత్ర మార్గంపై ఒకసారి పునరాలోచించుకోవాలని ఆదివారం రాహుల్‌ను అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ కోరారు. అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ నేపథ్యం ఘర్షణలు చోటుచేసుకునే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ.. ఈ అభ్యర్థన చేశారు. అస్సాంలోని 17 జిల్లాల మీదుగా 833 కి.మీ. మేర జనవరి 25 వరకు రాహుల్‌ యాత్ర కొనసాగనుంది. బతద్రవ సత్ర.. శ్రీమంత శంకరదేవ జన్మస్థలం. ఆయన 15వ శతాబ్దానికి చెందిన సాధువు..