
Threats Collectorate : అల్లూరిజిల్లా పాడేరు, జూలై 19, (త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఇటీవల నిర్వహించిన ఆదివాసీ మహాగర్జన ర్యాలీ, బహిరంగ సభ సందర్భంగా జిల్లా కలెక్టరేట్ను పేల్చివేస్తామని కొందరు వ్యక్తులు బెదిరింపు వ్యాఖ్యలు చేసినట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో, అలాంటి చర్యలను జిల్లా పోలీసు యంత్రాంగం తీవ్రంగా పరిగణించింది. ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు చేపట్టి, బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా పోలీసు సూపరింటెండెంట్ (ఎస్పీ) అమిత్ బర్దార్ ఆదేశించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఎలాంటి బెదిరింపు వ్యాఖ్యలు చేసినా వాటిని తీవ్రమైన నేరంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. ప్రజల్లో భయాందోళనలు సృష్టించే విధంగా వ్యవహరించిన వారిపై చట్టంలోని నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. విచారణలో బాధ్యులుగా తేలిన వారిపై చట్టప్రకారం తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ప్రతి పౌరుడికి ప్రజాస్వామ్యబద్ధంగా తమ అభిప్రాయాలను వ్యక్తీకరించే హక్కు ఉన్నప్పటికీ, ప్రభుత్వ సంస్థలు లేదా ప్రభుత్వ ఆస్తులను బెదిరించే విధంగా వ్యాఖ్యలు చేయడం, అలాంటి చర్యలకు ప్రేరేపించడం చట్టవిరుద్ధమని ఎస్పీ స్పష్టం చేశారు. శాంతిభద్రతలకు భంగం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe