ఎరువుల వినియోగం సక్రమంగా జరగాలి
కలెక్టర్ పి. ప్రశాంతి
రైతులకు ఎరువుల పంపిణీ వ్యవస్థలో పారదర్శకత, సమర్థత ఉండాలనే దృష్టితో తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు జిల్లా కలెక్టర్ పి. ప్రశాంతి తెలిపారు.
రాజానగరం: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, రాజానగరం మండలంలోని తోకాడ, భూపాలపట్నం సహకార సంఘాల కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్, అక్కడి పరిస్థితులను పరిశీలించి అధికారులకు, సిబ్బందికి పలు అంశాలపై దిశానిర్దేశం చేశారు. రికార్డులు నిర్వహణ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ, జిల్లాకు కేటాయించబడిన ఎరువుల సరఫరా విషయంలో ప్రభుత్వం నిర్దేశించిన విధంగా 50 శాతం ప్రభుత్వ రంగం, 50 శాతం ప్రైవేటు రంగం ద్వారా పంపిణీ జరగాలని స్పష్టం చేశారు. ఒక ఎకరానికి ఎన్ని బస్తాలు యూరియా అవసరమవుతుందో రైతులను వ్యక్తిగతంగా ప్రశ్నించిన కలెక్టర్, “సాధారణంగా 3-4 బస్తాలు అవసరమవుతాయి, అయితే 2-3 బస్తాలు సరిపోతాయి” అని వారు చెప్పినట్టు తెలిపారు. దీనికి అనుగుణంగా అవసరానికి మించి ఎరువుల వినియోగం వ్యవసాయేతర అవసరాలకు జరుగుతున్నట్లుగా స్పష్టం అవుతుందని తెలిపారు .
ప్రభుత్వం ప్రతి యూరియా బస్తాపై రూ.1542 సబ్సిడీ ఇస్తున్న నేపథ్యంలో, ఈ ఎరువులను దుర్వినియోగం చేయకుండా మండల స్థాయిలో రెవెన్యూ, వ్యవసాయ, హార్టికల్చర్, సహకార శాఖల అధికారులతో కూడిన ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి, నిత్యం పంపిణీపై పర్యవేక్షణ చేయాలని ఆదేశించారు. ఇతర జిల్లాలకు ఎరువులు తరలించకుండా, జిల్లాలో ఎరువుల వాస్తవ అవసరాల మేరకు సరఫరా నిర్ధారించాల్సిన అవసరం ఉందని తెలిపారు. కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించే దుష్ప్రయత్నాలను గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామం, మరియు,మండల స్థాయిల్లో వినియోగంపై నమోదైన రికార్డులను తనిఖీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇప్పటికే నాట్లు వేసిన పంటలకు అవసరమైన ఎరువుల సరఫరా పూర్తిగా జరిగిందా అనే అంశాన్ని కూడా సమీక్షించాలన్నారు.
ఈ తనిఖీలలో కలెక్టర్ వెంట జిల్లా సహకార అధికారి ఎం. వెంకటరమణ, మార్క్ఫెడ్ జిల్లా మేనేజర్ డి. ప్రతాప్, రైతులు మరియు సంబంధిత శాఖల సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


