
Relay Hunger Strike : కూకట్పల్లి జూలై 03, (త్రినేత్రం న్యూస్) : తెలుగు విశ్వవిద్యాలయం పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో శుక్రవారం రోజు నాంపల్లి క్యాంపస్లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు సంస్కృతి పరిరక్షకులు ,విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. విద్యార్థులు క్యాంపస్లో శాంతియుతంగా, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా, దాదాపు 30 మందికి పైగా పోలీసులు లాఠీలతో క్యాంపస్లోకి ప్రవేశించి మోహరించారు. దీంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. “మేము విద్యార్థులమా? లేక రౌడీలు, కబ్జాదారులు, సంఘవ్యతిరేక శక్తులమా?” అంటూ వారు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక ప్రైవేట్ వ్యక్తికి మద్దతుగా వ్యవహరించడం సమంజసం కాదని వారు పేర్కొన్నారు. దాదాపు 2,500 మందికి పైగా విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని తెలుగు విశ్వవిద్యాలయాన్ని ప్రైవేట్ వ్యక్తుల ప్రభావం నుంచి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు.తెలంగాణ తెలుగు, సంస్కృతిక ద్రోహి తిరుమల రావు వ్యక్తిగత సామగ్రిని వెంటనే క్యాంపస్ నుంచి తొలగించాలని, ఆద్యకళ ఆక్రమణలో ఉన్న గదులను తక్షణమే తెలుగు విశ్వవిద్యాలయానికి అప్పగించాలని కోరారు.తెలుగు భాష, తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచిన తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి క్యాంపస్లోనే కొనసాగాలని, దానిని పరిరక్షించి అభివృద్ధి చేయాలని విద్యార్థులు, అధ్యాపకులు మరియు పరిరక్షణ సమితి సభ్యులు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.అదేవిధంగా, బాచుపల్లి మరియు వరంగల్ తెలుగు విశ్వవిద్యాలయ ప్రాంగణాల్లోని విద్యార్థులు, అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, పూర్వ విద్యార్థులు, తెలుగు భాషాభిమానులు కూడా ఉద్యమానికి సంఘీభావం ప్రకటించారు.
నాంపల్లి క్యాంపస్ను పరిరక్షించాలని, తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లిలోనే కొనసాగాలని వారు డిమాండ్ చేశారు. అలాగే తిరుమలరావు వ్యవహారంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, విశ్వవిద్యాలయ పరిరక్షణ ఉద్యమానికి తమ పూర్తి మద్దతు ప్రకటించారు.”తెలుగు విశ్వవిద్యాలయాన్ని కాపాడుకుందాం – నాంపల్లిలోనే కొనసాగిద్దాం, పరిరక్షిద్దాం, అభివృద్ధి చేద్దాం” అనే నినాదాలతో మొదటి రోజు రిలే నిరాహార దీక్షలు విజయవంతంగా కొనసాగాయి.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe