Maoists in Telangana : తెలంగాణలో మావోయిస్టుల కదలికలు

TRINETHRAM NEWS

తెలంగాణలో మావోయిస్టుల కదలికలు?.. ఆపరేషన్‌ కగార్‌తో రాష్ట్రంలోకి..!!
అప్రమత్తమైన పోలీస్‌శాఖ
హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రతపెంపు
Trinethram News : Telangana : హైదరాబాద్‌, నవంబర్‌ 8 : రాష్ట్రంలో మావోయిస్టుల కదలికను పోలీస్‌ వర్గాలు గుర్తించినట్టు సమాచారం.

ఛత్తీస్‌గఢ్‌లో ‘ఆపరేషన్‌ కగార్‌’ పేరుతో కేంద్ర బలగాలు భీకర దాడులు చేస్తుండటంతో మావోయిస్టులంతా సరిహద్దు దాటి తెలంగాణలోకి వస్తున్నట్టు తెలుస్తున్నది. ఇందులో కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు అనుమానిస్తున్నారు. దీనిపై ఇంటెలిజెన్స్‌ హెచ్చరికల నేపథ్యంలో సరిహద్దు జిల్లాల ఎస్పీలు అప్రమత్తమయ్యారు.

ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాల్లో ఎస్పీల ఆధ్వర్యంలో గురువారం రాత్రి నుంచే పోలీస్‌ బలగాలు కూంబింగ్‌ను మొదలుపెట్టినట్టు సమాచారం. మావోయిస్టు సానుభూతిపరులపై కూడా నిఘా పెట్టినట్టు తెలుస్తున్నది. ములుగు జిల్లాలోని తాడ్వాయి మండల పరిధిలో గల బంధాల రిజర్వు అటవీ ప్రాంతంలోని వోడ్డుగూడెం గ్రామ సమీపంలో వెట్టేవాగు వద్ద ములుగు పోలీసులు భారీగా డంప్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో 4 ఎస్‌ఎల్‌ఆర్‌లు, 165 రౌండ్ల బుల్లెట్లు, ఇతర ఆయుధాలు ఉన్నాయి.

ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంపు

మావోయిస్టుల హెచ్చరికల నేపథ్యంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్‌కు భద్రత పెంచారు. ఆయన కార్యాలయానికి వచ్చి వెళ్లే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. బెల్లంపల్లిలో ఎమ్మెల్యే అనుచరుల ఆగడాలు పెరిగిపోయాయాని, వారికి ఆయన వత్తాసు పలుకుతుండటంతో మావోయిస్టు కోల్‌బెల్ట్‌ కార్యదర్శి ప్రభాత్‌ పేరిట హెచ్చరిస్తూ లేఖ విడుదల చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top