ఆగస్ట్ 16, 2026
TRINETHRAM NEWS
Minister Sandhya Rani

Minister Sandhya Rani : త్రినేత్రం న్యూస్ : ఎన్టీఆర్ జిల్లా: విస్సన్నపేట మండలం కొండ పర్వలోని గిరిజన సంక్షేమ గురుకుల బాలికల విద్యాలయాన్ని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా స్థానిక ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు కూడా మంత్రితో పాటు పాల్గొన్నారు. విద్యార్థినులతో కలిసి మంత్రి సంధ్యారాణి, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు భోజనశాలలో వడ్డించిన భోజనాన్ని రుచి చూసి, నాణ్యతను పరిశీలించారు.

ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను పరిశీలించిన మంత్రి, పలు అంశాలపై మీడియాతో మాట్లాడారు. రాష్ట్రవ్యాప్తంగా ఆశ్రమ పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాల్లో సుమారు 2 లక్షల మంది విద్యార్థులు చదువుతున్నారని మంత్రి తెలిపారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు విద్యార్థులకు ప్లేట్లు, గ్లాసులు, బెడ్ షీట్లు, ట్రంకు బాక్సులు వంటి వస్తువులను అందజేస్తున్నామని పేర్కొన్నారు.

విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులు బాగా చదవాలన్న లక్ష్యంతో చదువుల్లో పెను మార్పులు తీసుకొచ్చారని సంధ్యారాణి కొనియాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో గిరిజన సంక్షేమ శాఖ నుంచి రూ.2,500 కోట్లను రోడ్లు, హాస్టళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల కల్పనకు కేటాయించినట్లు వివరించారు. గిరిజన తాలూకా న్యాయమైన కోరికలు తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు.

జీవో నెంబర్ 3పై అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి పేర్కొంటూ, 2000వ సంవత్సరంలోనే ఈ జీవో ద్వారా గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేలా ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలోని 9 ఐటిడిఏల ద్వారా గిరిజన సంఘాలతో సమావేశమై వారి కోర్కెలపై చర్చించినట్లు తెలిపారు.

ఈ అంశంపై సీఎం చంద్రబాబు సానుకూలంగా ఉన్నారని, గిరిజన తాలూకా హక్కులను కాపాడేందుకు రేపు గిరిజన సంఘాలను ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించినట్లు మంత్రి సంధ్యారాణి వెల్లడించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page