TRINETHRAM NEWS

క్రిస్మస్ శుభాకాంక్షలు : ఎమ్మెల్యే శ్రీమతి రెడ్డి శాంతి

క్రిస్మస్‌ సందర్భంగా పాతపట్నం నియోజకవర్గ క్రైస్తవ సోదరులకు అందరికీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దైవ కుమారుడు జీసస్‌ మానవుడిగా జన్మించిన రోజును ప్రపంచమంతా క్రిస్మస్‌గా జరుపుకుంటున్నామని ఆమె అన్నారు. క్రిస్మస్‌ అనేది కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, అది మనిషిని నిరంతరం సన్మార్గంలో నడిపించే దైవికమైన ఒక భావన అని అన్నారు.దుర్మార్గం నుంచి సన్మార్గానికి, అమానుషత్వం నుంచి మానవత్వానికి, చెడు నుంచి మంచికి, దురాశ నుంచి దాతృత్వం–త్యాగాలకు జీసస్‌ తన జీవితం ద్వారా బాటలు వేశారని ఎమ్మెల్యే చెప్పారు.

సాటి మనుషుల పట్ల ప్రేమ, నిస్సహాయుల పట్ల కరుణ, ఆకాశమంత సహనం, అవధులు లేని త్యాగం, శాంతియుత సహజీవనం, శత్రువుల పట్ల సైతం క్షమాగుణం కలిగి ఉండాలన్నారు.