WhatsApp Image 2024 06 05 at 10.50.45
Let’s prevent land desertification! Let’s save the environment!!
ప్రపంచ పర్యావరణ దినోత్సవం (జూన్ 5) సందర్భంగా హైదరాబాద్ సిటిజన్స్ ఫోరం (హైదరాబాద్ జిందాబాద్) ఆధ్వర్యంలో నెక్లెస్ రోడ్ లోని లవ్ హైదరాబాద్ వద్ద జరిగిన మానవహారం కార్యక్రమంలో మాజీ శాస్త్రవేత్త డాక్టర్ బాబురావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. “సేవ్ హుస్సేన్ సాగర్ – సేవ్ హైదరాబాద్” అనే నినాదంతో మానవహారం నిర్మించి, నినాదాలు ఇచ్చారు.

డాక్టర్ బాబురావు మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ సంవత్సరం ఐక్యరాజ్యసమితి “మనభూమి – మన భవిత” అనే నినాదంతో భూమి ఎడారీకరణను నిరోధించాలని, భూమిని కాపాడాలని, పర్యావరణాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చిందని అన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో ఎడారీకరణ 23% గా ఉండి, పెరుగుతున్న పరిస్థితి ఉందని, దీనిని నిరోధించాల్సిన అవసరం చాలా ఉన్నదని అన్నారు.
గత ప్రభుత్వం విద్యుత్ అవసరాల కోసం విచ్చలవిడిగా థర్మల్ ప్లాంట్లను ప్రోత్సహించిందని ఫలితంగా పర్యావరణానికి తీవ్ర విఘాతం ఏర్పడిందని, దీనిని సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం ఆ సమీక్షను ఆర్థిక దుర్వినియోగం అనే ఆర్థిక కోణంలోనే చూస్తున్నదని, పర్యావరణ కోణంలో కూడా పరిశీలన జరగాలని కోరారు.
హైదరాబాద్ నగరాన్ని ఫార్మా హబ్ గా మార్చి పెట్టుబడుదారుల లాభాల కేంద్రంగా చూస్తున్నారని, కానీ పర్యావరణపరంగా తీవ్ర ప్రమాదంలో మన నగరం ఉన్నదని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేకించి దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని ఇవి ఇలాగే పెరిగితే 2030 నాటికి మానవ మనుగడే ప్రశ్నార్ధకం అవుతుందని హెచ్చరించారు.

సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి మాట్లాడుతూ హుస్సేన్ సాగర్ ప్రారంభంలో మంచి నీటి సాగర్ గా ఉండేదని, ఈరోజు కాలుష్య కేంద్రంగా తయారైందని పారిశ్రామిక వ్యర్ధాలు ముఖ్యంగా ఫార్మా వ్యర్ధాలు దీనిలోకి వదులుతున్నారని, దానిని అరికట్టాలని కోరారు. కెసిఆర్ ప్రభుత్వం హుస్సేన్ సాగర్ ను ప్రక్షాళన చేసి మంచినీటి కొలనుగా కొబ్బరినీరులా సాగర్ నీటిని మారుస్తామని ప్రగల్బాలు పలికారని ఆచరణలో కొబ్బరిలా హుస్సేన్ సాగర్ ను భక్షించారని విమర్శించారు. ప్రస్తుత ప్రభుత్వం మూసితోపాటు హుస్సేన్ సాగర్ పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం లో “మనభూమి – మన భవిత” అనే ఐక్యరాజ్యసమితి నినాధాన్ని ప్రతిబింబించేలా చేసిన “భూగోళం చిహ్నం” ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. హైదరాబాద్ జిందాబాద్ ప్రధాన కార్యదర్శి కే. వీరయ్య అధ్యక్షత వహించగా, ఎం.శ్రీనివాసరావు వందనం సమర్పణ చేశారు.
ఈ కార్యక్రమంలో హైదరాబాద్ జిందాబాద్ నగర నాయకులు మల్లం రమేష్, పి. శ్రీనివాస్, మోహన్, సైదులు, సుకుమార్, రాజమౌళి, అస్మిత, సంగీత, మాధవి, శ్రీవల్లి, గోపాల్, నర్సింగ్ రావు, రమేష్, రఘు, మల్లయ్య, బాబు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
