ఆగస్ట్ 18, 2026

WhatsApp Image 2024 02 13 at 18.38.29

TRINETHRAM NEWS

నల్గొండ: ఆరు నూరైనా తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని భారాస అధినేత కేసీఆర్‌ స్పష్టం చేశారు. నల్గొండ శివారులోని మర్రిగూడ బైపాస్‌ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు..

కృష్ణా జలాల కోసం చావో రేవో తేల్చుకోవాల్సిన సమయం వచ్చిందని ప్రజలకు పిలుపునిచ్చారు.

”కాలు విరిగినా కట్టె పట్టుకొని నల్గొండకు వచ్చా. ఇది రాజకీయ సభ కాదు.. ఉద్యమ సభ, పోరాట సభ. ఫ్లోరైడ్‌ వల్ల నల్గొండ ప్రజల నడుములు వొంగిపోయాయి. ఆ నాడు బాధితులను దిల్లీకి తీసుకెళ్లి అప్పటి ప్రధానికి చూపించాం. నీళ్లు లేకపోతే తెలంగాణ ప్రజలకు బతుకు లేదు. 24 ఏళ్లుగా పక్షిలాగా తిరిగి రాష్ట్రం మొత్తం చెప్పాను. తెరాస ప్రభుత్వం వచ్చాకే ఫ్లోరైడ్‌ సమస్య పోయింది. ఇప్పుడు నల్గొండ జిల్లా ఫ్లోరైడ్‌ రహిత జిల్లాగా మారింది. పోరాటం చేసి.. రాష్ట్రం తెచ్చి పదేళ్లు పాలించా. నా పాలనలో ఎవరికీ తక్కువ చేయలేదు. కొందరు ఓట్లు వచ్చినప్పుడే ప్రజల వద్దకు వస్తారు. నా ప్రాంతం, నా గడ్డ అనే ఆరాటం ఉంటే.. ఎక్కడివరకైనా పోరాడవచ్చు. పక్కనే కృష్ణమ్మ ఉన్నా.. ఫలితం లేకపాయే అని అప్పట్లో నేనే పాట రాశా..

బస్వాపూర్‌ ప్రాజెక్టు పూర్తయ్యింది, దిండి ప్రాజెక్టు పూర్తి కావొచ్చింది. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు పనులు 80శాతం పూర్తయ్యాయి. ఖమ్మం, నల్గొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ జిల్లా జీవన్మరణ సమస్య కృష్ణా జలాలు. ఏడాది పాటు తాత్కాలిక ప్రాతిపదికన కృష్ణా జలాలు కేటాయించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు సగం వాటా కేటాయించాలని కేంద్రాన్ని ఎన్నో సార్లు అడిగాం. ఇప్పుడు కృష్ణా జలాల్లో వాటా కోసం ట్రైబ్యునల్‌ ముందు పోరాడాలి. తెలంగాణకు అన్యాయం జరిగితే చివరి శ్వాస వరకు పులిలా కొట్లాడతా.. పిల్లి మాదిరిగా ఉండను” అని సీఎం కేసీఆర్‌ అన్నారు..

You cannot copy content of this page