కోల్‌కతా లో కుప్పకూలివ ఐదంతస్తుల భవనం : ఇద్దరు మృతి

TRINETHRAM NEWS

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌ రాజధాని కోల్‌కతా లో నిర్మాణంలో ఉన్న ఓ ఐదంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందారు. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. మరో పది మందిని సహాయక సిబ్బంది కాపాడారు. శిథిలాల కింద మరికొంత మంది ఉండొచ్చని నగర మేయర్‌ ఫిర్హాద్‌ హకీమ్‌ అనుమానం వ్యక్తం చేశారు. సహాయక చర్యలను కొనసాగిస్తున్నామని తెలిపారు. ఆదివారం రాత్రి గార్డెన్‌ రీచ్‌ ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు వెల్లడించారు.
ప్రమాదంపై రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన ఆదేశాల మేరకు రాత్రంతా అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమైనట్లు వెల్లడించారు. మృతుల కుటుంబాలకు రూ.ఐదు లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి సైతం ఆర్థిక సాయం అందజేస్తామన్నారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
ఘటన జరిగిన భవనంలో ఎవరూ లేరని స్థానికులు తెలిపారు. కానీ, దాని పరిసర ప్రాంతాల్లో ఉన్న గుడిసెలపై శిథిలాలు పడ్డాయని చెప్పారు. వాటిలో ఎవరైనా ఉండే అవకాశం ఉందని పేర్కొన్నారు. పదుల సంఖ్యలో చిక్కుకొని ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో అంబులెన్సులను సిద్ధంగా ఉంచామని నగర సీపీ వినీత్‌ గోయల్‌ తెలిపారు.
ఘటనపై భాజపా నేత సువేందు అధికారి స్పందించారు. కావాల్సిన సహాయక చర్యలను ముమ్మరం చేయాలని ప్రభుత్వాన్ని ‘ఎక్స్‌’ వేదికగా విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top