వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ : శుక్రవారం వికారాబాద్ మునిసిపల్ పరిధి శివరెడ్డి పేటలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన, కళాశాలలో వివిధ విభాగాలకు ఎన్నికల్లో నాయకులుగా ఎంపికైన విద్యార్థినులకు సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ మాట్లాడుతూ. విద్య పట్ల సానుకూల శక్తితో ముందుకు వెళ్తూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ప్రతి విద్యార్థి ఉన్నత స్థాయిలో ఎదగడానికి అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ కావాలన్నా మంచి కలలను కనాల్సిన అవసరం ఉందని ఆయన తెలిపారు. విద్యార్థినిలు రాష్ట్రస్థాయిలో ఉత్తమ ర్యాంకులు సాధించడం గర్వంగా ఉందని ప్రతి విద్యార్థి శ్రద్ధ, నిబద్ధత, క్రమశిక్షణతో ఎన్ని సమస్యలు వచ్చిన వాటిని ఎదుర్కొని ముందుకు సాగాలని ఆయన తెలిపారు. దేశ భవిష్యత్తు యువత పైనే ఉందని, దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిన బాధ్యత కూడా మీపై ఉందని విద్యార్థుల ఉద్దేశించి కలెక్టర్ తెలిపారు. న్యాయ, వైద్య, ఐఐటి తరగతులు నిర్వహించేందుకు పరిపాలనపరంగా ఖచ్చితమైన చేయూతనందిస్తానని కలెక్టర్ హామీ ఇచ్చారు.
కళాశాలలో విద్యార్థులు చేపట్టిన మాక్ ఎన్నికల నిర్వహణ విధానంపై చేపట్టిన వీడియో ఎంతగానో ఆకట్టుకున్నది. రాష్ట్రస్థాయి ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సరంలో ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థినిలకు ఘనంగా సన్మానం తో పాటు 10 వేల రూపాయల నగదు పారితోషికాన్ని కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. అదేవిధంగా కళాశాలలో ఎన్నికైన లీడర్లను కలెక్టర్ సన్మానించారు.
అనంతరం వసతి గృహంలోని భోజన శాలలో విద్యార్థినిలతో కలిసి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి విద్యార్థినిలతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. ముందుగా స్టోర్ రూమ్ లో ఉన్న బియ్యం, కందిపప్పు, రవ్వ నాణ్యతను కలెక్టర్ పరిశీలించారు. విద్యార్థినిలకు అందజేస్తున్న మెను వివరాలను ఆయన అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ట్రైనీ కలెక్టర్ హర్ష్ చౌదరి, కళాశాల ప్రిన్సిపల్ మహమూదా ఫాతిమా, రిటైర్డ్ డిఎండబ్ల్యూఓ హనుమంతరావు, స్థానిక నాయకులు హఫీజ్, అబ్దుల్ బషీర్, వెంకట్ రెడ్డి, ఫక్రుద్దీన్, విద్యార్థినిల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు సిబ్బంది పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


