
Trinethram News : పీఎం ఇంటర్న్షిప్ స్కీమ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ పొడికిస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రకటన జారీ చేసింది. మొత్తం 300కు పైగా కంపెనీల్లో లక్షకు పైగా ఇంటర్న్షిప్ అవకాశాలను అందించనుంది.
గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు మార్చి 12వ తేదీతో ఆన్లైన్ రిజిస్ట్రేషన్లు ముగిశాయి. తాజాగా ఈ తేదీని పొడిగించిన సర్కార్ మార్చి 31 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించింది.
ఈ మేరకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వశాఖ ప్రకటన జారీ చేసింది. అర్హులైన అభ్యర్థులు తుది గడువు ముగిసేలోగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.
ఈ ఇంటర్న్షిప్కు ఎంపికైన అభ్యర్ధులకు ఏడాదిపాటు శిక్షణ ఇస్తారు. శిక్షణ కాలంలో ప్రతి నెలా రూ.5 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తారు. దీనితోపాటు కంపెనీలో చేరే ముందు రూ.6,000 (వన్టైం గ్రాంట్) కూడా చెల్లిస్తారు.
అంటే మొత్తం మీద ఏడాదిలో రూ.66,000 పొందుతారు. ఏడాదిలో ఆరు నెలలు క్లాస్ రూంలో.. మిగిలిన 6 నెలలు ఫీల్డ్లో శిక్షణ ఉంటుంది.
పదో తరగతి పాసైన అభ్యర్థులతో పాటు ఐటీఐ, పాలిటెక్నిక్, బీఏ, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ, బీఫార్మసీ వంటి డిగ్రీలు కలిగి ఉన్నవారందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. వయసు 21 నుంచి 24 ఏళ్ల మధ్య ఉన్న యువతీ యువకులు ఈ పథకానికి అర్హులు.
ఆన్లైన్/దూరవిద్య ప్రోగ్రామ్లో చదువుకున్న వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసేవారి కుటుంబాలకు చెందినవారు, వార్షికాదాయం రూ. 8 లక్షలు దాటిన కుటుంబాలతో పాటు ఐఐటీ, ఐఐఎం వంటి ఉన్నత విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేషన్ చేసిన వారు, సీఏ, సీఎంఏ అర్హత కలిగినవారు ఈ ఇంటర్న్షిప్కు దరఖాస్తు చేసుకోవడానికి అనర్హులుగా కేంద్రం పేర్కొంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
