TRINETHRAM NEWS

ఘంటా రాజీనామా ఆమోదం.. టీడీపీ అలర్ట్‌..

TDP: దాదాపు మూడేళ్ల క్రితం తన పదవికి రాజీనామా చేశారు టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు.. ఇంత కాలం ఆ రాజీనామా వ్యవహారాన్ని పక్కనబెట్టిన స్పీకర్‌ తమ్మినేని సీతారాం ఇప్పుడు ఉన్నట్టుండి ఆమోద ముద్రవేయడం చర్చగా మారింది. అయితే, దీనికి వెనుక అధికార వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యూహం ఉందనే చర్చ సాగుతోంది.. ఇక, ఘంటా శ్రీనివాసరావు రాజీనామా ఆమోదంతో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ అలర్ట్‌ అయ్యింది.. వచ్చే రాజ్యసభ ఎన్నికల నాటికి తమ సంఖ్యా బలం తగ్గించేలా వైసీపీ వ్యూహం అంటున్నారు టీడీపీ నేతలు.. ఇదే సమయంలో.. పార్టీ మారిన నలుగురు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేల పైనా వేటు వేసే అవకాశం లేకపోలేదని టీడీపీ అంచనా వేస్తోంది..

ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేసి.. ఆ తర్వాత టీడీపీలో చేరారు ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. అయితే. ఆ నలుగురిపైనా వేటు పడుతుందని టీడీపీ భావిస్తోంది.. వైసీపీ వ్యూహానికి కౌంటర్ సిద్దం చేస్తోంది టీడీపీ.. తమ పార్టీ రెబల్‌ ఎమ్మెల్యేలపై తామిచ్చిన డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్ల ఆమోదం విషయంలో స్పీకర్‌పై ఒత్తిడి పెంచాలని టీడీపీ భావిస్తోంది.. టీడీపీ రెబెల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం, వంశీ, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై డిస్ క్వాలిఫికేషన్ పిటిషన్‌ను ఇప్పటికే వేసింది తెలుగుదేశం పార్టీ.. ఒకవేళ వైసీపీ రెబల్‌ ఎమ్మెల్యేగా ఉన్న ఉండవల్లి శ్రీదేవి, ఆనం రాంనారాయణరెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిపై అనర్హత వేటు పడితే.. టీడీపీ రెబల్‌లు అయినటువంటి కరణం బలరాం, వల్లభనేని వంశీ మోహన్‌, మద్దాలి గిరి, వాసుపల్లి గణేష్‌పై కూడా వేటు వేయాల్సిందేననే విధంగా స్పీకర్‌పై ఒత్తిడి తెచ్చేందుకు టీడీపీ సిద్ధం అవుతోంది..