అల్లూరిజిల్లా(అరకులోయ) త్రినేత్రం న్యూస్, జూన్ 5: మోసపూరిత హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బుధవారం ‘వెన్నుపోటు దినం’ నిర్వహించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం నేతృత్వంలో భారీ ర్యాలీ చేపట్టారు.
అరకు వ్యాలీ మండల కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమంలో, ఉమ్మడి విశాఖపట్నం జిల్లా జడ్పీ చైర్పర్సన్ జల్లిపల్లి సుభద్రతో పాటు స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుండి ఎమ్మార్వో కార్యాలయం వరకు నినాదాలతో కూడిన ర్యాలీ నిర్వహించడమైనది.
ఈ సందర్భంగా మాట్లాడిన ఎమ్మెల్యే మత్స్యలింగం మాట్లాడుతూ, “కూటమి నాయకులు మోసపు హామీలతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. తల్లికి వందనం పేరుతో పిల్లలకు, అన్నదాత సుఖీభవ పేరుతో రైతులకు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగులకు, ఉచిత బస్సు ప్రయాణం పేరుతో మహిళలకు వెన్నుపోటు పొడిచారు,” అంటూ మండిపడ్డారు.
అప్పులు చేసి వచ్చిన డబ్బులు ఎక్కడికి పోతున్నాయో వెల్లడించాలని డిమాండ్ చేశారు. పింఛన్ తప్ప ఏ సంక్షేమ పథకం అమలు చేయలేదని విమర్శించారు. గతంలో జగన్ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే 90 శాతం హామీలు అమలు చేసి ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుందన్నారు.
సూపర్ సిక్స్ పథకాలను తక్షణమే అమలు చేయాలని, లేకపోతే ప్రజల తరపున పోరాటం ముమ్మరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం ఎమ్మెల్యే మత్స్యలింగం ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


