Country’s First Helicopter : కర్ణాటకలో దేశంలోనే తొలి హెలికాప్టర్ల తయారీ కేంద్రం

TRINETHRAM NEWS

కోలారు జిల్లా వేమగల్‌లో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రం ఏర్పాటు

ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ సంయుక్త ప్రాజెక్ట్

తొలుత 10 యూనిట్లు.. ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్ల త‌యారీ

ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను భారత ఆర్మీకి, ఇతర దేశాలకు సరఫరా

Trinethram News : దేశంలోనే తొలిహెలికాప్టర్ల తయారీ కేంద్రం కర్ణాటకలో ఏర్పాటు కానుంది. యూరప్‌కు చెందిన వైమానిక ఉత్పత్తుల సంస్థ ఎయిర్‌బస్, టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ (TASL‌)లు సంయుక్తంగా కర్ణాటకలోని కోలారు జిల్లాలో హెచ్‌-125 తేలికపాటి హెలికాప్టర్ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నాయి. కోలారులోని వేమగల్‌ పారిశ్రామిక వాడలో ఏర్పాటయ్యే ఈ కేంద్రంలో హెలికాప్టర్ల తయారీకి స్వదేశీ సాంకేతికతను ఉపయోగించనున్నారు.

మొద‌ట‌ 10 యూనిట్లు, ఆ తర్వాత 20 ఏళ్లలో క్రమంగా 500 యూనిట్ల వరకు హెలికాప్టర్లు త‌యార‌వుతాయి. ఇలా తయారు చేసిన హెలికాప్టర్లను దేశీయ అవసరాలకు, భారతీయ సైన్యానికి, ఇతర దేశాలకు సరఫరా చేయనున్నారు. ఫ్రాన్స్, అమెరికా, బ్రెజిల్‌ తర్వాత హెచ్‌-125 హెలికాప్టర్ల తయారీ యూనిట్‌ను స్థాపిస్తున్న నాలుగో దేశంగా భారత్‌ అవతరించనుందని ఎకనామిక్ టైమ్స్ తెలిపింది.

ఇది భారతదేశంలో మొట్టమొదటి ప్రైవేట్ నేతృత్వంలోని హెలికాప్టర్ త‌యారీ యూనిట్ అవుతుంది. అలాగే ఏరోస్పేస్ తయారీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యొక్క మేక్ ఇన్ ఇండియా చొరవకు ప్రోత్సాహాన్ని అందించ‌నుంది. దీంతో పాటు రెండు కంపెనీలు గుజరాత్‌లోని వడోదరలో సీ-295 విమానాల కోసం ఫైనల్ అసెంబ్లీ లైన్ (FAL)ను ఏర్పాటు చేయాలనే ప్లాన్‌లో ఉన్నాయి.

హెలికాప్ట‌ర్ల త‌యారీ కేంద్రానికి కర్ణాటకనే ఎందుకంటే?
ఆంధ్రప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ వంటి అనేక ఇతర రాష్ట్రాల కంటే కర్ణాటకకు హెలికాప్ట‌ర్ల త‌యారీ కేంద్రం ఏర్పాటుకు అధిక‌ ప్రాధాన్యత ఇవ్వడానికి ప్రధాన కార‌ణం అక్కడ బాగా స్థిరపడిన ఏరోస్పేస్ తయారీ పర్యావరణ వ్యవస్థ ఉండ‌ట‌మే. టాటా గ్రూప్ యాజమాన్యంలోని సంస్థ ఇటీవల కర్ణాటకలోని వేంగల్ పారిశ్రామిక ప్రాంతంలోహెలికాప్టర్ల తయారీ, నిర్వహణ, మరమ్మతు తదితర కార్యకలాపాల కోసం 7.40 లక్షల చదరపు అడుగుల స్థలాన్ని సేకరించిన‌ట్లు తెలిసింది.

ఈ నేపథ్యంలో ఇతర ఒప్పంద కార్యక్రమాలను వేగంగా పూర్తి చేసేందుకు కర్ణాటక ప్రభుత్వం ఫాస్ట్‌ ట్రాక్‌ క్లియరెన్స్‌ విండోను ఏర్పాటు చేసినట్లు భారీ పరిశ్రమల శాఖ ప్రకటించింది. అలాగే కర్ణాటక తన ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ ప్రకారం… 5 సంవత్సరాల కాలానికి మూలధన పెట్టుబడి, స్టాంప్ డ్యూటీ, విద్యుత్ ఛార్జీలలో ప్రోత్సాహకాలు ఇవ్వ‌డంతో పాటు వార్షిక టర్నోవర్‌లో 1% ఉత్పత్తి సంబంధిత ప్రోత్సాహకాలు వంటి సబ్సిడీలను అందించ‌నుంది.

“భారతదేశంలో హెచ్‌-125 హెలికాప్టర్ల కోసం తుది అసెంబ్లీ లైన్‌ను ఏర్పాటు చేయడానికి ఎయిర్‌బస్‌తో భాగస్వామ్యం కుదుర్చుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఈ ప్రాజెక్ట్ ఇండియాలో హెలికాప్టర్ తయారీ సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. మ‌న దేశంలో పౌర విమానయాన వృద్ధికి తోడ్పడుతుంది” అని టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్ సీఈఓ, ఎండీ సుకరణ్ సింగ్ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Country's first helicopter manufacturing

You cannot copy content of this page

Scroll to Top