CM Chandrababu : మోదీ ప్రసంగం సరికొత్త భారతానికి నిదర్శనం

TRINETHRAM NEWS

జాతినుద్దేశించి పీఎం మోదీ చేసిన ప్రసంగంపై సీఎం చంద్రబాబు ప్రశంసలు

భారత్ నూతన సిద్ధాంతాన్ని మోదీ రూపొందించారని వ్యాఖ్య

పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది గట్టి హెచ్చరిక అని పేర్కొన్న టీడీపీ అధినేత

‘ఆపరేషన్ సిందూర్’ను ప్రస్తావిస్తూ స్వదేశీ ఆయుధాల సత్తాను కొనియాడిన చంద్రబాబు

ఉగ్రవాదం, చర్చలు కలిసి సాగవన్న ప్రధాని

వ్యాఖ్యలను ఉటంకించిన పవన్ కల్యాణ్

Trinethram News : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతినుద్దేశించి చేసిన ప్రసంగం భారతదేశపు నూతన సిద్ధాంతాన్ని ఆవిష్కరించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రశంసించారు. పాకిస్థాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు ఇది ఒక గట్టి హెచ్చరిక అని, ప్రపంచానికి భారతదేశ బలాన్ని స్పష్టం చేసిందని అన్నారు. ప్రధాని కేవలం ప్రసంగించడమే కాకుండా దేశానికి ఒక నూతన మార్గనిర్దేశం చేశారని చంద్రబాబు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు.

బుద్ధ పూర్ణిమ నాడు శాంతి మార్గాన్ని స్మరించుకుంటామని, అయితే చరిత్ర బోధించినట్లుగా బలంతోనే శాశ్వత శాంతి సాధ్యమవుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. “మనం శాంతి మార్గంలో పయనిస్తాం, కానీ ఉగ్రవాదం పట్ల మాత్రం జీరో టాలరెన్స్ పాటిస్తాం” అని స్పష్టం చేశారు.

‘ఆపరేషన్ సిందూర్’ గురించి ప్రస్తావిస్తూ, దేశీయంగా అభివృద్ధి చేసిన డ్రోన్లు, ఆయుధాలను విజయవంతంగా ఉపయోగించి సరిహద్దు ఆవలి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేశామని అన్నారు. ఈ ‘మేడిన్ ఇండియా’ రక్షణ సాంకేతిక పరిజ్ఞానం, మన దేశాన్ని కాపాడుకోవడానికి ఆధునిక యుద్ధానికి మన సంసిద్ధతను చాటిందని, ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేసిందని తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సాయుధ బలగాలు అత్యంత వేగంగా, కచ్చితత్వంతో స్పందించిన తీరును ఆయన ప్రత్యేకంగా అభినందించారు.

ప్రధాని మోదీ నాయకత్వంలో మన దేశం శాంతియుత మార్గంలో, అపారమైన శక్తిసామర్థ్యాలతో, అచంచలమైన లక్ష్యంతో నిలబడిందని చంద్రబాబు అన్నారు. భారతీయులుగా మనం ఐక్యంగా ఉంటూ, ఎల్లప్పుడూ దేశానికే ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రధాని ప్రసంగంపై పవన్ కల్యాణ్
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ప్రధాని ప్రసంగంపై స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ విషయంలో ప్రధాని మోదీ యావత్ భారతానికి, అంతర్జాతీయ సమాజానికి అత్యంత శక్తివంతమైన సందేశం ఇచ్చారని ఆయన కొనియాడారు. “ఉగ్రవాదం-చర్చలు కలిసి సాగవు, ఉగ్రవాదం-వాణిజ్యం కలిసి సాగవు, రక్తం-నీరు కలిసి ప్రవహించవు” అన్న ప్రధాని వ్యాఖ్యలను పవన్ తన ప్రకటనలో ఉటంకించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Modi's speech is proof

You cannot copy content of this page

Scroll to Top