Ramakrishna Math : రామకృష్ణ మఠంలో ఘనంగా పేరెంట్స్ ఓరియెంటేషన్ కార్యక్రమం

TRINETHRAM NEWS

రాజమహేంద్రవరం : రామకృష్ణ మఠంలో ఆదివారం పేరెంట్స్ ఓరియెంటేషన్ కార్యక్రమం ఘనంగా జరిగింది. విద్యార్థుల సమగ్ర ఎదుగుదల, చక్కని శీల నిర్మాణము, వ్యక్తిత్వ వికాసం కొరకు చేసే కృషిలో భాగంగా ఈ తల్లిదండ్రుల సమావేశం ఏర్పాటు చేయడమైనదని స్వామి పరిజ్ఞేయానందజీ మహరాజ్ తెలియజేసారు.

స్వామి సేవ్యానందజీ మహరాజ్ మాట్లాడుతూ ఆధ్యాత్మికత చాలా ముఖ్యం. సత్యం, సేవ, ప్రేమ, భక్తి, ధర్మపరాయణత చిన్నప్పుడే పిల్లలకు అలవడేలా చూడాలని, భగవాన్ శ్రీరామకృష్ణుల, శ్రీశారదాదేవి, స్వామి వివేకానందుల జీవిత అంశముల ద్వారా తెలియజేసారు. స్వామి శశికాంతానందజీ మహరాజ్ మాట్లాడుతూ విద్యార్థులకు తల్లి తొలి గురువని, తల్లి ఒడి, తొలి బడి అని, సత్యం, ధర్మం, విలువలు చిన్నపటి నుండి తెలియజేయాలని తెలియజేసారు. మొక్కలను ఏ విధంగా పెంచుతారో, పిల్లలను కూడా అదే విధంగా పెంచాలి. నీతి, నిజాయితీ, సత్యసంధత తెలియజేయాలి. పిల్లలలో ధర్మ ప్రవర్తన రావాలంటే తల్లిదండ్రులు బాధ్యతయుతంగా జీవిస్తూ, వారిలో ఉండే అవలక్షణాలను ప్రక్కన పెట్టి, పిల్లలకు మార్గదర్శకంగా ఉండాలని తెలియజేసారు.

స్వామి పరిజ్ఞేయానందజీ మహరాజ్ మాట్లాడుతూ తల్లిదండ్రులకు క్రమశిక్షణ ఉంటేనే పిల్లలకు కూడా క్రమశిక్షణ అలవడుతుందని, పిల్లలు అన్నీ చూసి నేర్చుకుంటారు. పెద్దలు ఆచరణలో పెట్టినవే పిల్లలు నేర్చుకుంటారు. మంచి వ్యక్తులను సమాజంలో వెతకడం కాదు. ఇంట్లోనే మంచి వ్యక్తులు తయారవుతారు. గర్భంలో ఉన్నప్పుడే పిల్లలకు మంచి సంస్కారాలు వస్తాయని, పిల్లలకు సానుకూల దృక్పథం అలవాటు చేయాలని, పిల్లలకు చెడు అలవాట్లు అలవాటవకుండా మొదట్లోనే సరిదిద్దాలి. దుష్టుల సాంగత్యంలో ఉంటే మన ఆలోచనలు అలాగే వెళతాయని, పిల్లలకు నైతిక విలువలు అలవాటు చేయాలి. ప్రార్థన వలన పిల్లలలో, పెద్దలలో మంచి మార్పులు తీసుకువస్తాయని తెలియజేసారు. న్యాయవాది పద్మావతి మాట్లాడుతూ ప్రతీ వ్యక్తిలోను దివ్యత్వం ఉంటుంది. ఆ దివ్యత్వాన్ని వెలికితీసి, దివ్యమైన జీవితం గడిపేటట్లు పిల్లలకు తల్లితండ్రులు మార్గదర్శకంగా ఉండాలని తెలియజేసారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

A grand parents orientation

You cannot copy content of this page

Scroll to Top