ఆవభూమి, దేవీచౌక్, పుష్కర ఘాట్ లో అవినీతికి రుజువులు
భరత్ జైలుకు వెళ్ళడం ఖాయం
ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హయాంలో త్రిబులింజన్ అభివృద్ధి
ఇకపై పీఎం భరత్ అని పిలుస్తాం
ఆవ భూమి రైతుల పేరిట దోచేసిన భరత్
టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు… బుడ్డిగ రాధ… చెల్లుబోయిన మూర్తి
Trinethram News : రాజమహేంద్రవరం :పారాచ్యూట్ లీడర్, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ జైలుకు వెళ్ళడానికి తొందరపడుతున్నాడని,ఆవభూమి, దేవీ చౌక్, పుష్కర ఘాట్ లో అతడి అవినీతి రుజువై జైలుకు వెళ్ళడం ఖాయమని టీడీపీ నాయకులు జోస్యం చెప్పారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ రాజమండ్రి పార్లమెంటు కమిటీ ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ చైర్మన్ కమిటీ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడారు. మజ్జి రాంబాబు మాట్లాడుతూ ఎంపీగా భరత్ చేసిన ఆవ భూమి అవినీతిపై సిఐడి విచారణ జరుగుతోందని, దేవీచౌక్, పుష్కర ఘాట్ వద్ద రాళ్ళు వేయడంపై విజిలెన్స్ విచారణ చేపట్టారన్నారు. వాటి విషయంలో అతని అవినీతి రుజువై ఎలాగూ జైలుకు పోతాడని అన్నారు.
శ్రీ గౌతమి సూపర్ బజారు లీజులో కూడా భరత్ అవినీతి తేటతెల్లమని, నిన్న 30 మందిని వేసుకువచ్చి సూపర్ బజారు స్థలం వద్ద ధర్నా చేసిప్రజల దృష్టిలో పడాలని తపన పడుతున్నాడని ఎద్దేవా చేశారు. ఎంపీగా భరత్ గౌతమి సూపర్ బజారు లీజు ఫైలుపై సంతకం చేయమంటే సొంతపార్టీ వారే సంతకం చేయలేదని, దాంతో వారిని తప్పించి భరత్ సంతకం చేశాడని ఆయన పేర్కొన్నారు. అవినీతికి పాల్పడిన అతనే ఇప్పుడు ధర్నా చేస్తున్నాడని మజ్జి రాంబాబు మండిపడ్డారు. తమ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఆ స్థలంలో నిర్మాణం ఆపడానికి ప్రయత్నాలు చేశారని, కాని లీజు దారులు కోర్టుకు వెళ్ళారని ఆయన వివరించారు. కోర్టు నుంచి నిర్మాణ పనులు నిలిపివేయాలని ఉత్తర్వులు వస్తే కార్పొరేషన్, సహకారశాఖ అధికారులు దాన్ని స్వాధీనం చేసుకుని జప్తు చేస్తారని మజ్జి రాంబాబు చెప్పారు.
ప్రతిపక్షంలో ఉన్న ఇదే సమయంలో ఆదిరెడ్డి వాసు, ఆదిరెడ్డి అప్పారావులను భరత్ అన్యాయంగా జైలుకు పంపించాడని, ఇక ఆదిరెడ్డి వాసు బయటకు రాడని, పోటీకి అనర్హుడవుతాడని భరత్ ప్రచారం చేశాడని గుర్తు చేశారు. ఆదిరెడ్డి బయటకు వచ్చారు… పోటీ చేసి భరత్ ను చిత్తుగా ఓడించారని మజ్జి రాంబాబు అన్నారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్న భరత్ అవినీతి కేసులో జైలుకు వెళ్ళి పోయి ఎన్నికల్లో గెలిచేద్దామని కలలు కంటున్నాడని ఎద్దేవా చేశారు. గతంలో జగనూ జైలుకు వెళ్ళాడు… చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్ళారని కాని బోత్ ఆర్ నాట్ సేమ్ అని అన్నారు. అలాగే ఆదిరెడ్డి వాసు, భరత్ బోత్ ఆర్ నాట్ సేమ్ అని మజ్జి రాంబాబు చమత్కరించారు. భరత్ జైలుకు వెళ్ళినప్పటికీ ఎన్నికల్లో గెలుస్తాడన్న గ్యారంటీ లేదని అన్నారు. ప్రతిపక్ష నాయకుడిగా ఆదిరెడ్డి వాసు నగరంలో అనేక చోట్ల భరత్ అవినీతికి వ్యతిరేకంగా వందలాది మందితో ఆందోళనలు చేశారని….
అవినీతి జరిగిందని ప్రజలు నమ్మారు కాబట్టే భరత్ ను చిత్తుగా ఓడించారని ఆయన చెప్పారు. ఆదిరెడ్డి వాసు త్రిబుల్ ఇంజన్ మాదిరి అభివృద్ధి చేసుకు వెళుతున్నారని మజ్జి రాంబాబు చెప్పారు. తమ నాయకుడు ఆదిరెడ్డి వాసు భవిష్యత్తులో భరత్ భరతం పట్టడం ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. బుడ్డిగ రాధా మాట్లాడుతూ మాజీ ఎంపీ భరత్ ను గాలి ఎంపీ, పారాచ్యూట్ లీడర్, రీల్ స్టార్ అని పిలిచినా ఫీలైపోతున్నాడని ఇకపై అతడిని పీఎం (ప్రెస్ మీట్ల) భరత్ అని పిలుస్తామన్నారు. ఎందుకంటే అతను ప్రెస్ మీట్లు పెట్టి బురదజల్లడం తప్ప మరేం చేయడం లేదని మండిపడ్డారు. గౌతమి సూపర్ బజారు లీజు 33 ఏళ్ళకు పెంచే అధికారం భరత్ కు ఎవరిచ్చారని ఆయన ప్రశ్నించారు. ఆ లీజు విషయంలో భరత్ కు ముడుపులు ముట్టాయనేది వాస్తవమని అన్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిన భరత్ చుట్టూ ఎలాంటి వారు ఉన్నారో అందరికీ తెలుసని అన్నారు. ఆపరేషన్ సిందూర్ మాదిరి మీ భద్రత మా బాధ్యత పేరుతో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నగరంలో బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ ను ఏరి పారేస్తున్నారని బుడ్డిగ రాధ అన్నారు.
కూటమి అధికారంలోకి వచ్చి 11 నెలలు అయింది, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ నగరంలోని గుళ్ళు, మసీదులు, చర్చిలకు లక్షలాది రూపాయలు ఇస్తున్నారని, ఒక్కో ఆర్వో ప్లాంటుకు రూ.4 లక్షలు ఖర్చు చేస్తూ మూడు చోట్ల ఏర్పాటు చేయించారని బుడ్డిగ రాధ చెప్పారు. ఎక్కడ విగ్రహాలు పాతవైనా వాటి స్థానంలో కొత్త అంబేద్కర్, జగజ్జీవన్ రామ్, ఎన్టీఆర్ విగ్రహాలు ఏర్పాటు చేయిస్తున్నారని పేర్కొన్నారు. నగర ప్రజల 15 ఏళ్ళ కల సాకారం చేసేందుకు రివర్ ఫ్రంట్ ఆరునెలల్లో పూర్తి చేస్తారని ఆయన వివరించారు. నిన్న కురిసిన వర్షం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పనితనానికి అద్దం పడుతుందని, గతంలో వర్షం కురిస్తే రెండుగంటలపాటు నీరు నిలిచి పోయేదని కాని నిన్న అరగంటలో వర్షం నీరు క్లియర్ అయిందని బుడ్డిగ రాధ పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు కాలువల్లో పూడిక తీయించడం వల్ల నగరం ముంపు సమస్య నుంచి బయటపడిందని ఆయన చెప్పారు. కూటమి నాయకులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు పనితీరును అభినందించారని బుడ్డిగ రాధా గుర్తు చేశారు.
అంబేద్కర్ నగర్ హెల్త్ సెంటర్ అభివృద్ధి కమిటీ చైర్మన్ చెల్లుబోయిన సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఆవ భూముల విషయంలో రైతుల నుంచి ఎకరం రూ. 35 లక్షల చొప్పున కొనుగోలు చేసి ఆ రైతులు ఖాతాల్లో స్థానికంగా ఉన్న ధర ప్రకారం నగదు జమ చేసి మిగతా మొత్తాన్ని భరత్ జేబులో వేసుకున్నారనేది వాస్తవమని అన్నారు. గౌతమీ సూపర్ బజారు స్థలం లీజులో అవినీతికి పాల్పడి సిగ్గు లేకుండా మళ్ళీ ధర్నా చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి నిధులు తేకుండా నగరపాలక సంస్థకు ప్రజలు కట్టిన పన్నులతో పార్కులు అభివృద్ధి చేసి అవకతవకలకు పాల్పడ్డారని అందుకే ప్రజలు ఎన్నికల్లో 74 వేల ఓట్ల తేడాతో ఓడించి బుద్ధి చెప్పారని చెల్లుబోయిన మూర్తి విమర్శించారు. కరోనా సమయంలో భరత్ భయంతో బయటకు రాకుండా ఇంట్లో కూర్చుని యోగా మెడిటేషన్ చేసుకున్నారని ఎద్దేవా చేశారు. 6వ వార్డులో వైసీపీ అట్టహాసంగా ప్రారంభించిన చలివేంద్రంలో మూడు రోజుల తర్వాత ఎవరూ లేరని ఆయన విమర్శించారు. విలేకరుల సమావేశంలో టీడీపీ నాయకులు ఈతలపాటి రవి, బొర్రా చిన్ని, బంగారు నాగేశ్వరరావు, కర్రి సూర్య నాయుడు, షేక్ బషీర్, ఆడారి లక్ష్మీ నారాయణ, ముద్రగడ జయరామ్, యం.డి అస్లాం తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


