జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

TRINETHRAM NEWS

జమిలి ఎన్నికలపై.. 5000 సూచనలు

దిల్లీ: ‘ఒకే దేశం – ఒకే ఎన్నిక (One Nation, One Election)’పై అధ్యయనానికి మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ (Ram Nath Kovind) నేతృత్వంలో కేంద్రం కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఈ కమిటీ చర్యలు ప్రారంభించింది. ఈ క్రమంలోనే ప్రజల నుంచి సలహాలు, సూచనలను ఆహ్వానించింది. దీనికి విశేష స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు తమ సూచన (suggestions)లను పంపిస్తున్నారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటివరకు 5వేలకు పైగా ఈ-మెయిళ్లు వచ్చినట్లు పేర్కొన్నాయి.

దేశంలో జమిలి ఎన్నికల (Simultaneous Polls)ను నిర్వహించేలా.. ప్రస్తుతం ఉన్న చట్టపరమైన అడ్మినిస్ట్రేటివ్‌ ఫ్రేమ్‌వర్క్‌లో తగిన మార్పులను సూచించాలని కోవింద్‌ కమిటీ ఇటీవల ఓ ప్రకటనలో కోరింది. జనవరి 15లోగా ప్రజలు తమ సలహాలు, సూచనలు పంపవచ్చని వెల్లడించింది. ఈ సూచనలను కమిటీ వెబ్‌సైట్‌ onoe.gov.inలో పోస్ట్ చేయాలని లేదంటే sc-hlc@gov.in ఐడీకి ఈ-మెయిల్‌ చేయాలని తెలిపింది.

ఒకే దేశం- ఒకే ఎన్నిక కోసం గతేడాది సెప్టెంబరులో ఈ కమిటీ ఏర్పాటైంది. అప్పటి నుంచి రెండుసార్లు సమావేశాలు నిర్వహించింది. ఇటీవల ఆరు జాతీయ పార్టీలు, 33 ప్రాంతీయ పార్టీల నుంచి అభిప్రాయాలు కోరింది. జమిలి ఎన్నికలపై న్యాయ కమిషన్‌ నుంచి కూడా సలహాలు తీసుకుంది.

You cannot copy content of this page

Scroll to Top