ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం..విపక్షాలకు తిరస్కరణ
Trinethram News : వక్ఫ్ సవరణ బిల్లు పరిశీలనకు ఏర్పాటు చేసిన సంయుక్త పార్లమెంటరీ కమిటీ పలు సవరణలతో బిల్లుకు సోమవారంనాడు ఆమోదం తెలిపింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలోని ఎన్డీయే ప్రతిపాదించిన 14 సవరణలకు ఆమోదం లభించగా, విపక్షాలు సూచించిన మార్పులు తిరస్కరణకు గురయ్యారు. జేపీసీ సమావేశానంతరం కమిటీ చైర్మన్ జగదాంబికా పాల్ ఆ వివరాలను వెల్లడించారు.
“మొత్తం 44 సవరణలు చర్చకు వచ్చాయి. సభ్యులందరిని సవరణలు సూచించాల్సిందిగా కోరాం. 6 నెలలపాటు సమగ్ర చర్చ జరిపాం. ఇదే మా చివరి సమావేశం. మెజారిటీ నిర్ణయం ప్రాతిపదికగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. విపక్షాలు సైతం సవరణలు సూచించాయి. ప్రతి సవరణను ఓటింగ్కు పెట్టాం. అయితే వారు సూచించిన సవరణలను సమర్ధిస్తూ 10 ఓట్లు, వ్యతిరేకిస్తూ 16 ఓట్లు వచ్చాయి” అని జగదాంబిక పాల్(Jagdambika Pal) తెలిపారు.
కాగా,కమిటీలో ఎన్డీయే సూచించిన మార్పులకు ఆమోదం లభించడం, తాము సూచించిన మార్పులు తిరస్కరణకు గురికావడంపై ప్రతిపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఓటింగ్ జరగలేదని అన్నారు. తమ వాదనలు వినలేదని, నియంతృత్వ ధోరణిలో జగదాంబికా పాల్ వ్యవహరించారని టీఎంసీ ఎంపీ కల్యాణ్ బెనర్జీ ఆరోపించారు. ”మేము ఏదైతే ఊహించామో ఇవాళ అదే జరిగింది. మమ్మల్ని మాట్లాడేందుకు అనుమతించ లేదు. నిబంధలు, విధివిధానాలను పాటించలేదు. సవరణలపై క్లాజ్ బై క్లాజ్ చర్చించాలని మేము కోరినప్పటికీ మమ్మల్ని మాట్లాడనీయలేదు. ఇది ప్రజాస్వామ్యానికి దుర్దినం” అని బెనర్జీ అన్నారు. అయితే బెనర్జీ ఆరోపణలను పాల్ తోసిపుచ్చారు. మొత్తం ప్రక్రియ అంతా ప్రజాస్వామ్యబద్ధంగా జరిగిందని, మెజారిటీ అభిప్రాయలను కమిటీ ఆమోదించిందని చెప్పారు. వక్ఫ్ చట్టం-1995లో పలు మార్పులు తీసుకు వస్తూ కేంద్రం గత ఆగస్టులో బిల్లు తీసుకువచ్చింది. అనంతరం బిల్లు పరిశీలనను 21 మంది సభ్యులతో కూడిన జేపీసీకి అప్పగించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


