TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. ప్రొద్దుటూరు పుట్టపర్తి సర్కిల్ లో రోడ్ షో నిర్వహించారు. జగన్ పాలనలో మీకు నష్టం కలిగితే టిడిపికి ఓటు వేయండని కోరారు. కడప ఎవరి సొత్తు కాదు.. కడప ఇలాఖాలో టిడిపి జండా ఎగురుతుందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. వైసిపి మేమంతా సిద్దం సభ జనానికి, ఈరోజు ప్రొద్దుటూరు ప్రజాగళం మీటింగ్ జనానికి తేడా చూసుకోమన్నారు. రాయలసీమకు గుండెలాంటి కడప నుంచి జగన్‎కు సవాల్ విసిరారు చంద్రబాబు. గత ఐదేళ్ళలో రాయలసీమకు, కడపకు కనీసం పులివెందులకు ఏమన్నా చేశావా అని ప్రశ్నించారు. అలాగే తానుంటే కడప స్టీల్ ప్లాంట్ ప్రారంభం చేసేవాడినని చెప్పారు. సీమ అంటే తనకు నీళ్ళు , అభివృద్ది , పరిశ్రమలని అదే జగన్ కు సీమ అంటే ఫ్యాక్షన్ రాజకీయాలని విమర్శించారు.

పులివెందుల ప్రజలు సైతం జగన్‎ను నమ్మం అంటున్నారన్నారు. ప్రజల ట్రెండ్ మారిందని చెప్పారు. టిడిపి సభ్యులందరూ తన కుటుంబ సభ్యులని.. వారిని నేను మర్చిపోతానా అన్నారు. మీ పోరాటాలకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్నారు. మీ రుణం తీర్చుకునే రోజు వస్తుంది. కచ్చితంగా తీర్చుకుంటానన్నారు. కడపలో స్టీల్ ఫ్యాక్టరీ వచ్చి ఉంటే జిల్లాలో అనేకమందికి ఉపాధి దొరికేదని చెప్పారు. అనంతపురానికి కియాను తీసుకొచ్చాను అది నా బ్రాండ్ అని పేర్కొన్నారు. శంకుస్దాపన చేసిన దానికి మళ్ళీ శంకుస్దాపన చేయడం జగన్ బ్రాండ్ అంటూ ఎద్దేవ చేశారు. కోనసీమలో కొబ్బరి చెట్టే వస్తుంది కాని సీమలో అరటి , చీని పండుతుందని వివరించారు. పోలవరం పూర్తిచేయడం తన కల అన్నారు చంద్రబాబు.

ఈఐదేళ్ళు నేను అధికారంలో ఉండి ఉంటే బనగాన పల్లికి కృష్ణ నీరు తెచ్చే వాడినన్నారు. రాయలసీమ గురించి మాట్లాడే అర్హత ముఖ్యమంత్రి జగన్‎కు లేదన్నారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ ఎక్కువైపోయాయన్నారు. వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలం అయిందని ఆరోపించారు. తాను అధికారంలోకి వచ్చిన 100రోజులలో గంజాయి అమ్మేవాడిని భూమిపై ఉంచనని తెలిపారు. హైటెక్ సిటీని అవుటర్ రింగ్ రోడ్డుని ఎయిర్ పోర్ట్‎ని నిర్మించి దేశంలోనే అగ్రగామి సిటీగా హైదరాబాద్ తయారు చేశానని చెప్పారు. తనది విజన్ అయితే జగన్ ది పాయిజన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

చంద్రబాబు హామీలు..
ఆడబిడ్డ నిధి కింద ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ. 1500 చొప్పున ఇస్తానన్నారు. తల్లికి వందనం పేరుతో రూ. 15000 చొప్పున ఎంతమంది ఉంటే అంతమందికి డబ్బులు ఇస్తానని హామీ ఇచ్చారు. దీపం పథకం కింద సంవత్సరానికి మూడు సిలిండర్లు ఉచితంగా ఇస్తానన్నారు. ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం కల్పిస్తానంటున్నారు. ప్రతి ఒక్క రైతుకు ఏడాదికి రూ. 20వేల రూపాయలు.. బిందు సేద్యానికి నిధులు కేటాయిస్తానన్నారు. నిరుద్యోగ భృతి కింద రూ. 3000 ఇస్తానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే మెగా డీఎస్సీ నిర్వహిస్తామన్నారు. వర్క్ ఫ్రం హోం కింద ఉద్యోగాలు తీసుకొస్తానన్నారు. రాష్ట్రాన్ని ప్రపంచానికి అనుసంధానం చేస్తానని తెలిపారు. ఇంటింటికి నీటిని అందించడమే కాకుండా వృద్దాప్య పెన్షన్ రూ.4000 ఇస్తాను అన్నారు.