TRINETHRAM NEWS

Trinethram News : 11 రోజులపాటు వేడుకలు
Yadagirigutta | యాదాద్రిభువనగిరి, మార్చి 10 అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు స్వయంభూ పంచ నారసింహుడు యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ప్రారంభం కానున్నాయి.
తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

ఈ నెల 21న శృంగార డోలోత్సవంతో వేడుకలు పరిపూర్ణం కానున్నాయి. ప్రధాన ఆలయ ఉద్ఘాటన తర్వాత రెండోసారి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఉత్తర మాఢ వీధుల్లో స్వామివారి కల్యాణం నిర్వహించనున్నారు. వార్షిక బ్రహోత్సవాల్లో భాగంగా 11 రోజులపాటు స్వామివారి నిత్య, మొక్కు, కల్యాణాలు, సుదర్శన నారసింహ హవన పూజలను నిలిపేసినట్టు అధికారులు తెలిపారు. కాగా.. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. స్వామివారికి రేవంత్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్‌లో భద్రాచలం పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు.

యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో కొండపైన దేవస్థానం ఆంక్షలు విధించింది. ఉదయం 8 నుంచి 11 గంటల వరకు దర్శనాలు నిలిపివేస్తున్నట్టు ఈవో రామకృష్ణారావు తెలిపారు. కొండపైకి భక్తులను, వాహనాలను అనుమతించడం లేదని స్పష్టం చేశారు.