TRINETHRAM NEWS

ఫిబ్రవరి లో మరో మూడు పథకాలు అమలు

ప్రకటించిన ఆరు హామీల్లో మరికొన్నింటిని అమలు చేయడానికి ప్రభుత్వం సమాయత్తం అ వుతోంది.

అందులో భాగంగా ఉచిత విద్యుత్,200 యూనిట్‌ల వరకు గృహజ్యోతి పథకం కింద రూ. 500 లకే సబ్సిడీ సిలిండర్ (మహాలక్ష్మీ పథకం కింద), ఇళ్లు కట్టుకోవడానికి రూ. 5లక్షల మంజూరు (ఇందిరమ్మ ఇంటి పథకం) పథకాలకు శ్రీకారం చుట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టుగా తెలిసింది.

ఇప్పటికే మహాలక్ష్మీ పథకం కింద ఆర్టీసి బస్సుల్లో ఉచిత బస్సు ప్రయాణంతో పాటు చేయూత పథకం కింద రూ.10లక్షల రాజీవ్ ఆరోగ్య బీమా పథకాన్ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.

అందులో భాగంగా రానున్న పార్లమెంట్ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకొని మూడు పథకాలను ప్రజల కు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా తెలిసింది.

దీనికి సంబంధించి ఇప్పటికే అర్హుల జాబితాను రూపొందించే పనిలో అధికారులు ఉండగా దానిని ఎలా అమలు చేయా లి, ముందుగా ఎంతమంది లబ్ధిదారులకు వాటిని అందచేయాలన్న దానిపై ప్రభుత్వం సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలిసింది.

ఈ పథకాలకు సంబంధించి విధి, విధానాలను కూడా త్వరలో ప్రభుత్వం వెల్లడించే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.
ఏప్రిల్ తరువాత మహిళలకు రూ.2500లు..!
గత ప్రభుత్వం హయాంలో గృహలక్ష్మి పథకం కింద దరఖాస్తులను తీసుకోగా, ప్రస్తుతం ఆ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం రద్దు చేయడంతో దాని స్థానంలో ఇందిరమ్మ పథకం కింద అర్హులకు రూ.5లక్షలను ఇవ్వాలని నిర్ణయించి నట్టుగా తెలిసింది.

అయితే మహాలక్ష్మీ పథకం కింద ప్రతి నెలా మహిళలకు రూ.2500లను వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించినా దానిని ఏప్రిల్ తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలిసింది.