TRINETHRAM NEWS

YSRCP Office: మంత్రి విడదల రజనీ కొత్త పార్టీ ఆఫీసుపై రాళ్లదాడి.. పోలీసుల అదుపులో ఆకతాయిలు..

గుంటూరులో అర్థరాత్రి ఉద్రిక్తత నెలకొంది. ఏపీ వైద్యారోగ్యశాఖ మంత్రి విడదల రజిని పార్టీ ఆఫీస్‎పై రాళ్ల దాడి చేశారు కొందరు యువకులు. ఈ దాడిలో ఆఫీసు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈపార్టీ ఆఫీసు ఎదురుగానే ఎన్టీఆర్ విగ్రహం ఉంటుంది. దీనిని ఎన్టీఆర్ సర్కిల్ అని కూడా పిలుస్తారు స్థానికులు. న్యూ ఇయర్ కావడంతో అర్థ రాత్రి టీడీపీ కార్యకర్తలు పసుపు జెండాలు పట్టుకొని ర్యాలీ చేసినట్లు గుర్తించారు పోలీసులు. అయితే ఈ రాళ్లదాడి ఎవరు చేశారన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ఘటనతో పార్టీ ఆఫీసు ముందు జనాలు గుమిగూడారు. వారిని చెదరగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు.

జనవరి 1న ఉదయం 10 గంటలకు పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంపై రాజకీయంగా ఆసక్తి చోటు చేసుకుంది. ఓపెనింగ్ కార్యక్రమానికి తగిన ఏర్పాట్లు చేసేందుకు కొందరు పనివాళ్లు నిన్న అర్థరాత్రి అక్కడ పనులు చేస్తూ ఉన్నారు. ఈ సమయంలో రాళ్ల దాడి జరగడంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇప్పటికే కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. పోలీసుల సంఖ్య తక్కువగా ఉండి.. వచ్చిన యువకుల సంఖ్య ఎక్కువగా ఉండటంతోనే ఈ ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఆకతాయిల చర్యలను అడ్డుకునేలోపే కొందరు పారిపోయారు. అయితే ఈరోజు పార్టీ ఆఫీసును ప్రారంభించేందుకు అక్కడకు చేరుకోనున్నారు విడదల రజిని.