ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 12 28 at 17.39.43

TRINETHRAM NEWS

బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జరుగుతున్న నాలుగో టెస్టులో భారత క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి శతకంతో అదరగొట్టాడు.

Trinethram News : మెల్‌బోర్న్: ఆస్ట్రేలియా గడ్డమీద టాపార్డర్ బ్యాటర్లు, దిగ్గజ ఆటగాళ్లు పరుగులు చేయలేక ఇబ్బందులు పడుతుంటే తెలుగుతేజం నితీష్ కుమార్ రెడ్డి మాత్రం తేలికగా పరుగులు సాధిస్తున్నాడు. అరంగేట్ర సిరీస్ అయినప్పటికీ ఏ బెరుకు లేకుండా ఆడుతున్న నితీష్ రెడ్డి ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో కీలక సమయంలో సెంచరీ సాధించడంపై ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. నితీష్ రెడ్డి టెస్టు కెరీర్‌లో తొలి శతకం (176 బంతుల్లో 105 పరుగులతో నాటౌట్) సాధించి రికార్డులు తిరగరాశాడు. ప్రపంచం తనవైపు చూసేలా సత్తా చాటాడు.

నితీష్ కుమార్ రెడ్డి తొలి టెస్టు శతకం, అది కూడా ఆసీస్ గడ్డమీద చేయడంతో యంగ్ క్రికెటర్ తండ్రి ముత్యాలరెడ్డి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆయన ఇన్నేళ్ల కష్టం, త్యాగాలకు ఫలితం వచ్చిందని నెటిజన్లు, క్రికెట్ ప్రేమికులు కామెంట్ చేస్తున్నారు. నితీష్ రెడ్డి శతకం పూర్తి కాగానే, ప్రేక్షకులతో కలిసి లేచి చప్పట్లు కొడుతూ కొడుకు ఘనతను సెలబ్రేట్ చేసుకున్నారు. భావోద్వేగానికి లోనైన ముత్యాలరెడ్డి ఆనంద భాష్పాలు రాల్చారు. కొడుకు విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ చిన్న పిల్లాడిలా మారిపోయారు. తన కష్టం, త్యాగాలకు ఫలితం వచ్చిందన్న సంతోషం కనిపించింది. ఆ సమయంలో కామెంటెటర్ రవిశాస్త్రి కళ్లల్లో సైతం నీళ్లు వచ్చాయంటే అది ఎంత ముఖ్యమైన సందర్భమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

164/5 తో బ్యాటింగ్ ప్రారంభించినభారత్ మరో 27 పరుగులకు కీలకమైన రిషభ్ పంత్ వికెట్ కోల్పోయింది. తరువాత జడేజాతో కలిసి నితీష్ స్కోరు బోర్డును నడిపించాడు. లియన్ బౌలింగ్ లో జడేజా వికెట్ల ముందు దొరకడంతో 7 వికెట్ గా పెవిలియన్ చేరాడు. అక్కడ మొదలైంది భారత్ మరో పోరాటం. తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డి, మరో ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్ లు ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టారు. చెత్త బంతులను వదిలేస్తూ, ఆచితూచి ఆడూతూ ఆసీస్ బౌలర్లను ఆటాడుకున్నారు. ఈ క్రమంలో 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నెం.8, నెం.9లో బ్యాటింగ్ కు దిగి 150 బంతులు ఎదుర్కొన్న బ్యాటర్లుగా నితీష్, సుందర్ రికార్డు నెలకొల్పారు. నితీష్‌కు సహకారం అందించిన సుందర్ 146 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ వెంటనే లయన్ బౌలింగ్ లో ఔటయ్యాడు.

బుమ్రా డకౌట్ కాగా, వెలుతు లేమితో ఆట త్వరగా నిలిపివేశారు. మూడో రోజు ఆట నిలిపివేసే సమయానికి నితీష్ రెడ్డి (105 నాటౌట్), మహ్మద్ సిరాజ్ (2) నాటౌట్‌గా నిలిచారు. ఇంకా ఆసీస్ 116 పరుగుల ఆధిక్యంలో ఉంది. లోయర్ ఆర్డర్ లో నితీష్, సుందర్ పోరాడకుంటే భారత్ పరిస్థితి మరీ దారుణంగా ఉండేది. ఆడేది అరంగేట్ర సిరీస్ అయినా, నితీష్ కుమార్ రెడ్డి కీలక ఇన్నింగ్స్‌లు ఆడాడు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page