హైదరాబాద్-ముంబై మధ్య హైస్పీడ్ రైలు కారిడార్ ..
దీనిని బెంగళూరు, చెన్నై వరకు విస్తరించే యోచన
దేశంలోని ప్రధాన నగరాలను బులెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్ట్లో కీలక ముందడుగు
హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నైకి ఇక రెండుమూడు గంటల్లోనే
Trinethram News : హైదరాబాద్ వాసులు బుల్లెట్ రైలు ఎక్కే రోజులు ఎంతో దూరంలో లేవు. దేశంలోని ప్రధాన నగరాలను బుల్లెట్ రైలుతో అనుసంధానించే భారీ ప్రాజెక్టులో మరో కీలక అడుగు పడింది. హైదరాబాద్-ముంబై మధ్య 709 కిలోమీటర్ల మేర హైస్పీడ్ కారిడార్ నిర్మించాలని రైల్వే నిర్ణయించింది. ఈ కారిడార్ను బెంగళూరు వరకు విస్తరించాలని భావిస్తోంది. దీంతోపాటు మైసూరు-చెన్నై మధ్య నిర్మించ తలపెట్టిన హైస్పీడ్ రైలు కారిడార్ను కూడా హైదరాబాద్ వరకు విస్తరించాలని యోచిస్తోంది. అదే జరిగితే హైదరాబాద్ నుంచి ముంబై, చెన్నై, బెంగళూరుకు మధ్య ప్రయాణ దూరం గంటల్లోకి తగ్గిపోతుంది.
ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య జపాన్ సంస్థ సాంకేతికత, ఆర్థిక సాయంతో హైస్పీడ్ కారిడార్ నిర్మిస్తున్నారు. ఈ మార్గంలో జపాన్ తయారీ బుల్లెట్ రైలు నడవనుంది. ఆ తర్వాతి దశలో మరిన్ని హైస్పీడ్ కారిడార్లు నిర్మించనున్నారు. వాటిలో పైన పేర్కొన్న హైదరాబాద్-ముంబై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై మార్గాలు కూడా ఉన్నాయి. వీటిలో హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు కారిడార్లను ఎలివేటెడ్, భూగర్భ మార్గాల్లో నిర్మిస్తారు.
హైదరాబాద్-బెంగళూరు మధ్య దూరం 618 కిలోమీటర్లు. సాధారణ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్లలో హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లేందుకు 11 గంటలు, వందేభారత్లో ఎనిమిదిన్నర గంటల సమయం పడుతోంది. అదే బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే కేవలం 2 గంటల్లోనే బెంగళూరు చేరుకునే వెసులుబాటు లభిస్తుంది. అలాగే, హైదరాబాద్-చెన్నై మధ్య దూరం 757 కిలోమీటర్లు కాగా, సాధారణ ఎక్స్ప్రెస్ రైళ్లలో అయితే 15 గంటల సమయం పడుతుంది. బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే ఈ సమయం రెండున్నర గంటలకు తగ్గపోతుంది. అయితే, ఈ ప్రాజెక్టులు పూర్తయ్యేందుకు 10 నుంచి 13 సంవత్సరాలు పడుతుందని రైల్వే అధికారులు అంచనా వేస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App