TRINETHRAM NEWS

బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం, ప్రెస్ నోట్, తేది:30.12.2023

నూతన సంవత్సర వేడుకలను ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలి బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు.

మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోము: ఎస్పీ గారు

జిల్లా ప్రజలు నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతవంతమైన వాతావరణంలో జరుపుకోవాలని, మద్యం సేవించి వాహనాలను నడిపిన, బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించిన ఉపేక్షించబోమని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ గారు హెచ్చరించారు. డిసెంబర్ 30న శనివారం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ప్రజలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా శాంతియుత వాతావరణంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఇతరుల మనోభావాలు దెబ్బతినకుండా, ఆకతాయి పనులకు పాల్పడకుండా, ఎదుటివారిని ఇబ్బంది పెట్టకుండా వ్యవహరించాలన్నారు. ట్రిపుల్‌ రైడింగ్‌, రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌ చేయవద్దని, బైక్ ల సైలెన్సర్ లు తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ వాహనాలను నడిపినా, మద్యం సేవించి వాహనాలను నడిపిన సదరు వాహనాలను సీజ్‌ చేసి వాహన చోదకులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తామన్నారు. గుంపులు, గుంపులుగా తిరుగుతూ ఇతరులను ఇబ్బందులకు గురిచేసే వారిని ఉపేక్షించబోమన్నారు. బాణాసంచా కాల్చడం, పరిమితికి మించిన ధ్వనితో డీజేలు ఏర్పాటు చేయడం చట్ట విరుద్ధమన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్టపరంగా కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువతపై కేసులు నమోదైతే భవిష్యత్‌లో ప్రభుత్వ, ప్రవేటు ఉద్యోగాలలో చేరాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించాలన్నారు. చట్టాన్ని ఉల్లంఘించి నమోదైన కేసులతో నూతన సంవత్సరంలో అడుగు పెడతారో (లేదా) నూతన సంతోషంతో కొత్తగా ఎంచుకున్న ఆశయాలను ఛేదించాలనే లక్ష్యంతో నూతన సంవత్సరంలో అడుగుపెడతారో అనేది దృష్టిలో ఉంచుకొని యువత శాంతియుత వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవాలని ఎస్పీ గారు సూచించారు.

జిల్లా పోలీస్ అధికారులను ఉద్దేశించి మాట్లాడుతూ 2023 వ సంవత్సరం డిసెంబర్ 31 శనివారం రాత్రి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ముఖ్యమైన కూడళ్ళలో పికెట్ లు ఏర్పాటు చేసుకోవాలన్నారు. గత గణాంకాలను పరిశీలిస్తే డిసెంబర్ 31 రాత్రి ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుంది కనుక విస్తృతంగా డ్రంక్ & డ్రైవ్‌ తనిఖీలు నిర్వహించాలని, మద్యం మత్తులో ఎవరైనా వాహనాలు నడిపినా, బైక్ ల సైలెన్సర్ లు తీసివేసి రణగొణ ధ్వనులను సృష్టిస్తూ ఇతరులకు ఇబ్బంది కలిగించే విధంగా వాహనాలు నడిపినా, అతివేగంగా వాహనాలను నడిపిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకొని, వాహనాలను సీజ్ చెయ్యాలన్నారు. మైనర్లు వాహనాలను నడిపితే ఆ వాహనాన్ని స్వాధీనం చేసుకొని వాహన యజమానిని, మైనర్ ల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున ప్రజలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఇతరులను ఇబ్బంది కలిగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. వైన్ షాప్ లు, బార్ లు, రెస్టారెంట్లు, ఇతర దుకాణాలు, హోటళ్ళు ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మూసివేసే విధంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.