TRINETHRAM NEWS

ఏపీలోని ఈ ప్రాంతం మరో ‘కేజీఎఫ్’.. జీఎస్ఐ సర్వేలో షాకింగ్ విషయాలు

కర్నూలు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడి పంట పొలాల్లో పంట కంటే కూడా అధికంగా వజ్రాలు దొరుకుతూ ఉంటాయి. దీంతో రైతులు పంట పండించడం కంటే కూడా వజ్రాలను వెతకడంలో ఎక్కువ ఆసక్తి చూపుతారు. రైతులతో పాటూ రైతు కూలీలు, చుట్టుపక్కల ప్రాంతాల వారు వజ్రాల వేట కొనసాగిస్తూ ఉంటారు. వీరందరినీ ఆశ్చర్యానికి గురి చేసేలా కేంద్ర భూగర్భ శాస్త్ర నిపుణులు బంగారం లాంటి విషయాన్ని వెల్లడించారు.

ఆస్పరి మండలం చిరుమాను దొడ్డి, ఆస్పరి అట్టేకళ్ళుతో పాటు మరో 5 గ్రామాల సరిహద్దు ప్రాంతాల్లో ఇటీవల జీఎస్ఐ (GSI) జియేలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా బృందం సర్వే నిర్వహించింది. ఆస్పరి మండలంలోని పలు గ్రామాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు ప్రాథమికంగా అంచనా వేసింది. నిన్న విజయవాడలో జరిగిన జీఎస్ఐ GSI రాష్ట్ర బోర్డ్ సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు అధికారులు. కర్నూలు జిల్లా అస్పరి మండలంలో బంగారు నిక్షేపాలున్నాయని.. ఈ నిక్షేపాలు ఎంత పరిమాణంలో ఉన్నాయి, వీటి నాణ్యత, ఎంత విస్తీర్ణంలో ఉన్నాయనే అంశంపై చర్చ జరిగింది. పూర్తి స్థాయి వివరణ ఇవ్వాలనే జీఎస్ఐ బృందాన్ని కోరారు ఉన్నతాధికారులు. త్వరలో మరో మారు ఆస్పరి మండలంలో జీఎస్ఐ GSI బృందాలు పర్యటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాలు దొరుకుతున్న వేళ.. పగిడిరాయిలో బంగారు గనుల నుంచి పసిడిని వెలికి తీస్తున్నారు. ఇలాంటి సమయంలో అస్పరిలో బంగారు నిక్షేపాలు ఉన్నయన్న విషయాన్ని జీఎస్ఐ బృందం బయటపెట్టడంతో ఆ గ్రామస్తులు ఆనందంలో మునిగితేలుతున్నారు.