ఆగస్ట్ 17, 2026

WhatsApp Image 2023 12 31 at 2.59.12 PM

TRINETHRAM NEWS

Indonesia Earthquake: ఇండోనేషియాలో భారీ భూకంపం.. రిక్టర్‌ స్కేల్‌పై 6.5గా తీవ్రత నమోదు

పపువా : ఇండోనేషియాలోని తూర్పు ప్రాంతంలోని పపువాలో ఆదివారం తెల్లవారుజామున భయంకర భూకంపం సంభవించింది. పపువా ప్రావిన్స్ రాజధాని జయపురాలోని ఉప జిల్లా అబేపురాకు ఈశాన్యంగా 162 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం సంభవించింది. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 6.5 గా నమోదైనట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే తెలిపింది. దాదాపు10 కిలోమీటర్ల లోతులో భూకంపం సంభవించింది. ప్రాణ, ఆస్తి నష్టంపై ఇంతవరకూ ఎలాంటి నివేదికలు వెలువడలేదు. ప్రస్తుతానికి సునామీ ప్రమాదం లేదని, అయితే భూకంపం భూమిలో కేంద్రీకృతమై ఉన్నందున మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం ఉన్నట్లు ఇండోనేషియాలోని మెటీరియాలజీ, వాతావరణ శాస్త్రం, జియోఫిజికల్ ఏజెన్సీ హెచ్చరించాయి. భూకంపం వల్ల ఎటువంటి సునామీ ముప్పు లేదని హవాయిలోని పసిఫిక్ సునామీ హెచ్చరికల కేంద్రం సైతం వెల్లడించింది.

కేవలం 62,250 జనాభా కలిగిన అబేపురా ఇండోనేషియాలోని అతి తక్కువ జనాభా కలిగిన పట్టణాలలో ఒకటి. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన భూకంపం ధాటికి అబేపురా ప్రావిన్స్‌ ప్రభావితమైంది. నాటి ప్రమాదంలో నీళ్లలో తేలియాడే రెస్టారెంట్ సముద్రంలో కూలిపోవడంతో నలుగురు వ్యక్తులు మరణించారు. ఇండోనేషియా 270 మిలియన్లకు పైగా జనాభా కలిగిన విస్తారమైన ద్వీపసమూహం. పసిఫిక్ బేసిన్‌లోని అగ్నిపర్వతాలు, ఫాల్ట్ లైన్‌ల ఆర్క్‌ల కారణంగా ఇక్కడి ద్వీపాల్లో తరచుగా భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు సంభవిస్తుంటాయి.

పశ్చిమ జావాలోని సియాంజూర్ నగరంలో నవంబర్ 21న సంభవించిన భూకంపం వల్ల ధాటికి దాదాపు 331 మంది మరణించారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. భూకంప తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 5.6గా నమోదైంది. సులవేసిలో 2018లో సంభవించిన భూకంపం వల్ల 4,340 మంది మరణించారు. ఇండోనేషియాలో ఇది అత్యంత ఘోరమైన భూకంపంగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక 2004లో హిందూ మహాసముద్ర భూకంపం వల్ల ఏర్పడిన సునామీ ధాటికి దాదాపు 12 దేశాల్లో 2,30,000 మందికి పైగా మరణించారు. మృతుల్లో ఎక్కువ మంది ఇండోనేషియాలోని అచే ప్రావిన్స్‌కు చెందినవారు.

You cannot copy content of this page