
Telangana Assembly : త్రినేత్రం న్యూస్ : హైదరాబాద్, మార్చి 16: తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 31 వరకు జరగనున్నాయి. ఈ మేరకు బీఏసీ సమావేశంలో నిర్ణయించారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అధ్యక్షత బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. మార్చి 16 నుంచి మార్చి 31 వరకు సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు. ఈరోజు(సోమవారం) ఉదయం గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగంతో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.
ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం అనంతరం స్పీకర్ సభను రేపటికి(మంగళవారం) వాయిదా వేశారు. అనంతరం స్పీకర్ ఛాంబర్లో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు నిర్వహించాలనే దానిపై చర్చించారు. రేపు(మార్చి 17), ఎల్లుండి(మార్చి 18) గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదం తెలిపే తీర్మానంపై చర్చ జరగనుంది. ఈనెల 20న అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశపెట్టనుంది. ఆపై 23 నుంచి 26 వరకు బడ్జెట్పై చర్చలు జరపనున్నారు. మార్చి 31న ద్రవ్య వినిమియ బిల్లుపై చర్చ జరగనుంది. అలాగే ఉగాది, రంజాన్, శ్రీరామనవమికి అసెంబ్లీకి సెలవులు ప్రకటించనున్నారు.
బీఏసీ సమావేశానికి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి శ్రీధర్ బాబు, విప్ బీర్ల ఐలయ్య హాజరయ్యారు. బీఆర్ఎస్ నుంచి హరీశ్ రావు, కేపీ వివేక్ హాజరవగా.. బీజేపీ నుంచి మహేశ్వర్ రెడ్డి, ఎంఐఎం నుంచి అక్బరుద్దీన్, సీపీఐ నుంచి కూనంనేని సాంబశివరావు సమావేశంలో పాల్గొన్నారు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news

