Donald Trump : భారత్-పాక్ అణు యుద్ధాన్ని ఆపా : ట్రంప్ నోట‌ మ‌ళ్లీ అదే మాట‌

TRINETHRAM NEWS

గతేడాది సైనిక ఘర్షణపై మరోసారి ప్రస్తావించిన అమెరికా అధ్యక్షుడు

ఇది తన ప్రభుత్వ ఘనతగా పేర్కొన్న వైట్‌హౌస్

ట్రంప్ వాదనను తీవ్రంగా ఖండించిన భారత ప్రభుత్వం
మూడో దేశం మధ్యవర్తిత్వం లేదని స్పష్టీక‌ర‌ణ‌

Trinethram News : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతేడాది భారత్, పాకిస్థాన్ మధ్య అణు యుద్ధం జరగకుండా తానే నివారించానని ఆయన పునరుద్ఘాటించారు. తన రెండో విడత అధ్యక్ష పదవిలో తొలి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా వైట్‌హౌస్‌లో మీడియాతో మాట్లాడుతూ ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.

గతేడాది మే నెలలో ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ఇరు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తినప్పుడు తానే జోక్యం చేసుకుని శాంతిని నెలకొల్పానని ట్రంప్ అన్నారు. “పాకిస్థాన్, భారత్ తీవ్రంగా ఘర్షణ పడ్డాయి. వారు అణు యుద్ధానికి వెళ్లేవారని నా అభిప్రాయం. పాక్ ప్రధాని ఇక్కడికి వచ్చి, ‘అధ్యక్షుడు ట్రంప్ 10 మిలియన్ల మంది ప్రాణాలను కాపాడారు’ అని చెప్పారు” అని ట్రంప్ వివరించారు. ఇదే విషయాన్ని వైట్‌హౌస్ కూడా అధికారికంగా ప్రకటించింది. “365 డేస్‌లో 365 విజయాలు” పేరుతో విడుదల చేసిన ప్రకటనలో… భారత్-పాక్ మధ్య శాంతిని నెలకొల్పడం ట్రంప్ ప్రభుత్వ కీలక దౌత్య విజయాల్లో ఒకటని పేర్కొంది.

ఖండించిన భారత్
అయితే, ట్రంప్ వాదనలను భారత ప్రభుత్వం తీవ్రంగా, స్థిరంగా ఖండిస్తూ వస్తోంది. ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంలో ఏ మూడో దేశం పాత్ర లేదని పలుమార్లు స్పష్టం చేసింది. 2025 ఏప్రిల్‌లో జమ్మూకశ్మీర్‌లోని పహల్గామ్‌లో 26 మంది పర్యాటకుల మృతికి కారణమైన ఉగ్రదాడికి ప్రతిస్పందనగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ చేపట్టింది. ఆ తర్వాత ఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య నేరుగా జరిగిన చర్చల ఫలితంగానే కాల్పుల విరమణ అమలైందని భారత్ చెబుతోంది.

కాగా, ఈ విషయంలో తనకు నోబెల్ శాంతి బహుమతి రావాల్సి ఉండేదని, కానీ నార్వే నియంత్రణలో ఉండే కమిటీ తనకు అన్యాయం చేసిందని ట్రంప్ మరోసారి తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. గతంలో కూడా పలుమార్లు ఆయన ఇదే తరహా వాదనలు చేయడం గమనార్హం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Stop India-Pakistan nuclear war

You cannot copy content of this page

Scroll to Top