అరకులోయ డిసెంబర్ 24, (త్రినేత్రం న్యూస్): మండల రెవెన్యూ అధికారి (ఎంఆర్ఓ), ఆర్డీవో లాగిన్లో పెండింగ్లో ఉన్న మ్యుటేషన్స్, భూ సర్వేలకు సంబంధించి అన్ని ప్రక్రియలను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్, పాడేరు ఐటిడిఏ పీవో తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు.
మంగళవారం ఐటిడిఏ పీవో ఛాంబర్లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా రెవెన్యూ అధికారులు, మండల రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న మ్యుటేషన్స్, సర్వే సంబంధిత సమస్యలను సకాలంలో పరిష్కరించాలన్నారు. ప్రతిరోజూ పెండింగ్లో ఉన్న భూ సంబంధిత సర్వేలపై సమీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
మండలాల వారీగా పెండింగ్లో ఉన్న మ్యుటేషన్స్, రీ–సర్వే సమస్యలపై అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. పరిష్కారం కాని అంశాలను వెంటనే జిల్లా యంత్రాంగం దృష్టికి తీసుకురావాలని సూచించారు. క్షేత్రస్థాయి సిబ్బంది నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.
జిల్లాలో రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీని శతశాతం పూర్తిచేయాలని, పంపిణీలో ఎదురయ్యే అవాంతరాలను అధిగమించాలన్నారు. చౌక ధరల దుకాణాల రెన్యువల్కు సంబంధించిన దస్త్రాలను ఆర్డీవో కార్యాలయానికి పంపించి అనుమతులు పొందాలని సూచించారు. స్మార్ట్ కార్డుల్లో కుటుంబ సభ్యుల పేర్ల నమోదు, తొలగింపులు సమగ్ర సమాచారంతో నిర్వహించాలని అన్నారు.
పీ ఎం జన్మన్ పథకం కింద మంజూరైన గృహాలను త్వరగా పూర్తి చేసేలా లబ్ధిదారులకు అవగాహన కల్పించాలని, గృహ నిర్మాణాలను నిరంతరం పర్యవేక్షించి పూర్తి అయిన నిర్మాణాలకు బిల్లులు సకాలంలో మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ప్రభుత్వ రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ సమావేశంలో చింతూరు ఇంచార్జ్ పీవో శుభం నొక్వాల్, అసిస్టెంట్ కలెక్టర్ సాహిత్, ఇంచార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి అంబేద్కర్, పాడేరు ఇంచార్జ్ ఆర్డీవో లోకేశ్వరరావు, వివిధ మండలాల రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


