పాడేరు, డిసెంబర్ 12, (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జనపద కళలు సృజనాత్మకత అకాడమీ చైర్మన్, జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య మాట్లాడుతూ పంచాయతీరాజ్ వ్యవస్థలో చేపట్టిన నూతన సంస్కరణలు గ్రామీణ ప్రజలకు మరింత మేలు చేయనున్నాయని పేర్కొన్నారు.
ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, పంచాయతీరాజ్ శాఖను పూర్తిగా ప్రజామైత్రిగా, పారదర్శకంగా మార్చే దిశగా ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుందని తెలిపారు. గతంలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గందరగోళపూరితమైన క్లస్టర్ వ్యవస్థను రద్దు చేసి, స్థానిక సంస్థలు స్వతంత్రంగా, సమర్థవంతంగా పనిచేసే విధంగా మార్పులు చేయడం ప్రజలకు లాభదాయకమని పేర్కొన్నారు.
ప్రతి పంచాయతీకి ప్రత్యేక కార్యదర్శిని నియమించడం ద్వారా గ్రామస్థాయిలో ప్రజలకు ఎప్పటికప్పుడు సేవలు అందేలా చూస్తున్నామన్నారు. రెవెన్యూ శాఖలో ఉన్నట్టే పంచాయతీరాజ్ శాఖకు కూడా డివిజనల్ అభివృద్ధి అధికారులను నియమించడం ద్వారా గ్రామీణ అభివృద్ధి పర్యవేక్షణకు కొత్త దిశ లభించిందని చెప్పారు.
పంచాయతీ అభివృద్ధి, ఆస్తుల రక్షణ, ప్రజలకు అవసరమైన సేవల అందుబాటు వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుని డివిజనల్ అభివృద్ధి అధికారులకు ప్రభుత్వం 16 రకాల కీలక అధికారాలు కల్పించిందని గంగులయ్య వివరించారు. ఈ సంస్కరణలు గ్రామాల్లో అభివృద్ధి వేగాన్ని పెంచడమే కాకుండా, స్థానిక సంస్థలకు బాధ్యత, జవాబుదారీతనం కలిగి పనిచేసే అవకాశం కల్పిస్తాయని అన్నారు.
గ్రామీణ ప్రజల అవసరాలు తీర్చడంలో ఈ మార్పులు మైలురాయిగా నిలుస్తాయని ఆయన అభిప్రాయపడ్డారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


