అరకులోయ, నవంబర్ 26, (త్రినేత్రం న్యూస్): ప్రముఖ పర్యాటక కేంద్రం ఆంధ్ర ఊటీగా పేరుగాంచిన అరకులోయలో గత వారం రోజులుగా త్రాగునీటి సమస్య తీవ్రమవుతోంది. పట్టణంలోని పలు కాలనీల్లో చుక్కనీరు అందక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆరోపిస్తూ ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో శరభగుడ హౌసింగ్ కాలనీ నీటి కుళాయి వద్ద స్థానికులు సోమవారం నిరసన తెలిపారు.
ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాలదేవ్ మాట్లాడుతూ, అరకులోయలో నీటి సరఫరా నిలిచిపోవడం ఆర్డబ్ల్యూఎస్ శాఖ, పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని విమర్శించారు. సి కాలనీ, బి కాలనీ, పోస్ట్ ఆఫీస్ కాలనీ, శరభగుడ హౌసింగ్ కాలనీ, రెంటల్ హౌసింగ్ కాలనీ, ప్రభుత్వ ఆసుపత్రి కాలనీ, కొండవీధి, ఆదివాసి కాలనీ తదితర ప్రాంతాలు కలిపి సుమారు పదివేల మంది జనాభా ఉన్నప్పటికీ, గత వారం రోజులుగా ఒక్క చుక్క నీరు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
అరకులోయ రక్షిత త్రాగునీటి పథకం పేరుతో లక్షల రూపాయలు ఖర్చు చేస్తూనే, శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించకపోవడం బాధాకరమన్నారు. తక్షణమే మంచినీటి సరఫరా పునరుద్ధరించాలని, సంబంధిత అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించాల్సిందిగా బాలదేవ్ డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరించకపోతే ప్రజలను తీసుకొని ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో శరభగుడ హౌసింగ్ కాలనీ మహిళలు పూర్ణిమ, వరహాలమ్మ, కాసులమ్మ, లక్ష్మి, శాంతి, బుజ్జి, డొమిని తదితరులు, యువతలో శ్రీను, కుమార్, జనార్దన్, పవన్ కుమార్ పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


