ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : గరుడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలి
రహదారి నిర్మాణం చేపట్టకపోతే ఆందోళన కార్యక్రమాలు
. అంతాడ పంచాయతీ సర్పంచ్ సుర్ల చంద్రరావు
అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలంలోని, అంతాడ పంచాయతీ పరిధిలో ఉన్న మారుమూల గ్రామమైన గరుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, పంచాయతీ సర్పంచ్ సుర్ల చంద్రరావు తెలిపారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేక గ్రామానికి చెందిన గెమ్మెలి సోమేశ్వర్రావు, రాజులమ్మ దంపతుల కుమారుడు అఖిల్ (9)అనే బాలుడు మృత్యువాత పడ్డాడని ఆవేదన వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడిని డోలి మోత మోసుకొని శనివారం ఆసుపత్రికి తరలిస్తుండగా, పరిస్థితి విషమించి మార్గమధ్యలో తల్లిదండ్రుల కళ్లముందే బాలుడు మృతి చెందాడని తెలిపారు. ఈమేరకు గ్రామానికి వెళ్లి, బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి,ఓదార్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, గరుడ గ్రామానికి రహదారి సౌకర్యం లేక, సరైన సమయంలో ఆసుపత్రికి వెళ్లలేక గతంలో కూడా పలువురు బాలింతలు, పిల్లలు, వృద్ధులు మృతి చెందారని అన్నారు.
సంవత్సరాల తరబడి ఇవే ఘటనలు పునరావృతం అవుతున్నాయని అన్నారు. అమాయక గిరిజనులు మృత్యువాత పడుతున్నారని ఆవేదన చెందారు. గరుడ గ్రామానికి రహదారి సౌకర్యం కల్పించాలని ఇప్పటికే పలుమార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందించామన్నారు. గ్రామస్తులతో కలిసి మీకోసం కార్యక్రమాల్లో అర్జీలు పెట్టామని తెలిపారు. అయితే ఇప్పటి వరకూ ఎలాంటి స్పందన లేదన్నారు. టెండర్ లేదని, ఫారెస్టు క్లియరెన్స్ లేదని సాకులు చెబుతున్నారని, రోడ్డు నిర్మించడం లేదన్నారు. అమాయక గిరిజనుల మరణాలు చూసైనా ప్రభుత్వం, అధికారులు వెంటనే స్పందించి రహదారి నిర్మాణం చేపట్టాలని సర్పంచ్ చంద్రరావు డిమాండ్ చేశారు. లేకుంటే స్థానిక ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


