
Accident Risk : అరకులోయ,ఆగస్టు 13,( త్రినేత్రం న్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకు వేలి మండలం పద్మాపురం పంచాయతీ పరిధిలోని ఎండపల్లివలస గంగమ్మతల్లి గుడి సమీపం నుంచి గ్రీన్ వ్యాలీ జంక్షన్ వరకు రహదారి మధ్యలో ఉన్న డివైడర్ ప్రమాదకరంగా మారింది. డివైడర్పై గడ్డి, అవాంఛిత మొక్కలు విపరీతంగా పెరిగి పూర్తిగా కప్పుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ మార్గంలో ప్రతిరోజూ వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. ముఖ్యంగా రాత్రివేళల్లో డివైడర్ స్పష్టంగా కనిపించకపోవడంతో ప్రమాదాల ముప్పు పొంచి ఉందని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. డివైడర్కు ఏర్పాటు చేసిన రిఫ్లెక్టర్లు, హెచ్చరిక బోర్డులు సైతం గడ్డి, అవాంఛిత మొక్కలు మధ్య కనిపించకుండా పోతున్నాయి.
ప్రజల రాకపోకలకు కీలకమైన ఈ మార్గంలో సమస్య ఉన్నప్పటికీ సంబంధిత పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ప్రమాదాలు చోటుచేసుకోకముందే డివైడర్పై పెరిగిన గడ్డి,అవాంఛిత మొక్కలు తొలగించాలని, రిఫ్లెక్టర్లు, స్పష్టమైన సేఫ్టీ హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని స్థానికులు, వాహనదారులు కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe