TRINETHRAM NEWS

ఫిబ్రవరి నెలలో మంత్రులు ఎవరు అయోధ్యకు వెళ్లకూడదు: ప్రధాని

Trinethram News : న్యూఢిల్లీ:జనవరి 25
కేంద్ర మంత్రులు ఎవరూ కూడా అయోధ్య రామాలయ దర్శనానికి వెళ్లకూడదని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. ఇటీవలే ప్రాణప్రతిష్ట జరిగిన రామాలయానికి భారీ సంఖ్యలో భక్తులు, యాత్రికులు తరలివస్తున్నారు.

దీనితో రద్దీని నియంత్రించేందు కు చర్యలు తీసుకోవల్సిన అవసరం ఉందని అయోధ్య స్థానిక అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో తమ మంత్రివర్గ సహచరులకు ప్రధాని నుంచి సంబంధిత విషయంలో బుధవారం సూచనలు వెలువడ్డాయి.

మంత్రులు తమ విఐపి, వివిఐపి హోదాలలో రద్దీ దశలో అయోధ్యకు వెళ్లితే తలెత్తే పరిస్థితిని దృష్టిలోతీసుకుని ప్రధాని మోడీ నుంచి ఈ విషయంలో ఆదేశాలు వెలువడినట్లు అధికారవర్గాలు తెలిపాయి.

ఫిబ్రవరి వదిలేసి, మంత్రులు అయోధ్యకు మార్చి నెలలో వెళ్లవచ్చునని, అప్పటివరకూ తమ పర్యటన వాయిదా వేసుకోవాలని ప్రధాని కోరినట్లు వెల్లడించారు. బుధవారం కేంద్ర కేబినెట్ సమావే శం జరిగింది. ఈ దశలో అయోధ్యలో రామాలయంలో ప్రాణప్రతిష్ట, దీనిపై ప్రజాస్పందన గురించి మంత్రులను ప్రధాని ప్రశ్నించినట్లు వెల్లడైంది.

యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటోందని, దూర ప్రాంతాల నుంచి బాలరాముడిని చూసేందుకు జనం తరలివస్తున్నారని, విశేష స్పందన ఉందని మంత్రులు ప్రధానికి వివరించినట్లు తెలిసింది. 22న రామాలయ ప్రాణప్రతిష్ట ఘట్టం ఘనంగా జరిగింది. ప్రధాన ఘట్టానికి ఆహ్వానితులుగా తరలివచ్చిన విశిష్టులు ఆ తరువాత ప్రత్యేకంగా బాలరాముడిని సందర్శించుకున్నారు.

మరుసటి రోజు మంగళవారం నుంచి దర్శనం సార్వత్రికం అయింది.తొలిరోజునే దాదాపు ఐదులక్షల మంది వరకూ దర్శనం చేసుకున్నారు. ఈ సంఖ్య ఈ వారాంతంలో మరింత పెరుగుతుందని, ఫిబ్రవరి అంతా కూడా ఇదే విధంగా ఉంటుందని అధికారులు అంచనా వేశారు.

మంళవారం తెల్లవారు జామున మూడు గంటలకు దర్శనానికి భక్తులు బారులు తీరారు. కాగా జనం కిక్కిరిసిన దశలో కొద్ది సేపు దర్శనం నిలిపివేయాల్సి వచ్చింది. ఆలయం ప్రాంగణం, అయోధ్యలో పలు ప్రాంతాలలో జనం కిక్కిరిసి ఉన్నారు. దీనితో పరిస్థితిని సమీక్షించుకుని అధికారులు రోజంతా అయోధ్యకు వచ్చే వాహనాలను శివార్లకు చాలా దూరంలోనే నిలిపివేశారు.

పరిస్థితిని సమీక్షించిన తరువాతనే ఈ వాహనాలను అయోధ్యలోకి పంపించేందుకు వీలుంటుందని తెలిపారు. నెలరోజుల పాటు మంత్రులు, ఉన్నతాధికారులు, సెలబ్రిటీలు ఎవరూ కూడా దర్శనానికి రాకుండా ఉండటం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.

ఈ విషయాన్ని ప్రధానికి తెలియచేయడంతో, దీనికి అనుగుణంగానే ప్రధాని ఇప్పుడు మంత్రులకు దీనిపై తగు సలహాలు వెలువరించినట్లు వెల్లడైంది.