TRINETHRAM NEWS

Trinethram News : అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) సతీమణి నారా భువనేశ్వరి (Nara Bhuvaneswari) తలపెట్టిన ‘నిజం గెలవాలి’ యాత్ర (Nijam Gelavali) ముగింపుకు వచ్చేసింది..

ఎన్టీఆర్ జిల్లాలో ఈనెల 13న ‘నిజం గెలవాలి’ ముగింపు సభ నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. టీడీపీ అధినేత అరెస్ట్‌తో మనస్థాపం చెందిన కుటుంబాలను ‘నిజం గెలవాలి’ పేరుతో భువనేశ్వరి పరామర్శించారు. ఇప్పటి వరకు భువనమ్మ 8,500 కిలోమీటర్లు ప్రయాణించారు. బాధిత కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పడంతో పాటు వారికి ఆర్థిక సాయం అందజేశారు.

Ram Temple in Sukma: 21 ఏళ్ల తరువాత తెరుచుకున్న రామ మందిరం.. గ్రామస్తుల సంబరాలు..

గత 6 నెలలుగా 25 పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోని 95 నియోజకవర్గాల్లో 194 బాధిత కుటుంబాలను పరామర్శించారు. చంద్రబాబు అరెస్టుతో మనస్తాపం చెంది దాదాపు 206 మంది మృతి చెందారు. ఈనెల 13వ తేదీ సాయంత్రం 4:00 గంటలకు తిరువూరులో దారా పూర్ణయ్య టౌన్ షిప్ వద్ద ”నిజం గెలవాలి” ముగింపు సభ జరుగనుంది. ‘నిజం గెలవాలి’ ముగింపు సభకు విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు జరుగుతున్నాయి..

కాగా.. టీడీపీ అధినేత అక్రమ అరెస్ట్‌తో మనస్థాపం చెందిన అనేక మంది టీడీపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. వారి గురించి తెలుసుకున్న టీడీపీ అధినేత సతీమణి భువనేశ్వరి.. బాధిత కుటుంబాలను కలవాలని నిర్ణయించారు. అందుకు ‘నిజం గెలవాలి’ పేరుతో యాత్రకు భువనమ్మ శ్రీకారం చుట్టారు. ఇందులో భాగంగా అనేక మంది టీడీపీ కార్యకర్తల కుటుంబాలను కలిసి పరామర్శించారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇస్తూ ముందుకు సాగారు. భువనేశ్వరి ‘నిజం గెలవాలి’ కార్యక్రమానికి అశేష ప్రజాదరణ లభించింది. గతేడాది అక్టోబర్‌లో ”నిజం గెలవాలి” యాత్ర ప్రారంభం అవగా.. ఆరు నెలలుగా కొనసాగింది. విడతలవారీగా ‘నిజం గెలవాలి’ పేరుతో బాధిత కుటుంబాలను భువనమ్మ పరామర్శించారు.