TRINETHRAM NEWS

బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ సౌకర్యం: కేంద్ర హోంశాఖ

పొరుగుదేశాలతో సరిహద్దులు పంచుకొంటున్న ప్రాంతాల్లోని దాదాపు 1,117 బోర్డర్‌ పోస్టులకు అత్యాధునిక 4జీ మొబైల్‌ కమ్యూనికేషన్‌ సౌకర్యాలు ఏర్పాటు చేయాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించింది..

దీనికి సుమారు రూ.1,545.66 కోట్లు ఖర్చవుతాయని ఆ శాఖ తెలిపింది. ఈ మేరకు టెలికాం శాఖ, హోంశాఖ, బీఎస్‌ఎన్‌ఎల్‌ మధ్య త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రాజెక్టు వచ్చే ఆరున్నరేళ్లలో పూర్తి కానుంది. వీటిల్లో కొన్ని సాయుధ దళాలకు చెందిన ఇంటెలిజెన్స్‌ పోస్టులు కూడా ఉండనున్నాయి..

కేంద్రం చేపట్టిన 4జీ సాచురేషన్‌ ప్రాజెక్టులో భాగంగా లద్దాఖ్‌లో మొత్తం 379 గ్రామాలు, మారుమూల ప్రాంతాల్లో కమ్యూనికేషన్‌ వ్యవస్థల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వీటిల్లో తొమ్మిది గ్రామాల్లోనే పనులు పూర్తయ్యాయి. మరో 34 చోట్ల ప్రారంభ దశలో ఉన్నాయి. మయన్మార్‌తో 2.4 కి.మీ, పాక్‌తో ఉన్న 18 కి.మీ సరిహద్దులో గతేడాది ఫెన్సింగ్‌ పని కూడా పూర్తి చేశారు..