TRINETHRAM NEWS

TS Ration Cards: రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం-తెలంగాణలో రేషన్ కార్డులన్నీ రద్దు..!

తెలంగాణలో తాజాగా అధికారం చేపట్టిన రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలో రాష్ట్రంలో రేషన్ కార్డుల వ్యవస్ధను ప్రక్షాళన చేస్తోంది. ప్రస్తుతం రేషన్ కార్డులు కలిగి ఉన్న వారిలో అనర్హులను గుర్తించి వారి స్ధానంలో అర్హులకు కార్డులు అందించేందుకు వీలుగా తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రెండు కోట్ల 80 లక్షల కార్డుల్ని రద్దు చేస్తున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రేషన్ కార్డులను రద్దు చేయనున్నారు. వీటి స్ధానంలో కొత్త కార్డుల జారీ కోసం అధికారులు లబ్దిదారుల ఎంపిక చేపడతారు. గ్రామ సభలు, డివిజన్, వార్డు సభల ద్వారా నూతన రేషన్ కార్డు లబ్ధిదారుల ఎంపిక చేపట్టబోతున్నారు. వీటిపై రెండు రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. అలాగే రేషన్ కార్డులు తీసుకునేందుకు అర్హతల్ని కూడా నిర్ణయించారు. వీటిలో పలు కీలక అర్హతలు ఉన్నాయి.
రేషన్ కార్డు పొందాలంటే 100 గజాల పైబడి ఇల్లు లేదా ఫ్లాటు, సొంత కారు కలిగి ఉండరాదు. గతంలో అర్హత కలిగి ఉండి ఇప్పుడు సంపన్నులుగా ఉన్నవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. ప్రభుత్వ ఉద్యోగం, డాక్టర్, లాయర్ తోపాటు మరికొన్ని రంగాల్లో పనిచేస్తున్న వారికి రేషన్ కార్డు జారీ ఉండదు. పన్నులు చెల్లించేవారు రేషన్ కార్డుకు అనర్హులుగా నిర్ణయించారు. వీటితోపాటు మరికొన్ని కీలక సమగ్ర సమాచారం ఆధారంగా రేషన్ కార్డుల జారీ కార్యక్రమం ఉండబోతోంది.

అలాగే తెలంగాణ ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన నిబంధనలతో నకిలీ, ఫేక్ రేషన్ కార్డులకు చెక్ పడబోతోంది. ఆరోగ్యశ్రీ 15 లక్షల రూపాయలకు పెంపుతో పాటు రేషన్ లో మరికొన్ని సరుకులు అందించే ఆలోచనలోనూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.త్వరలో దీనిపై ప్రభుత్వం క్లారిటీ ఇవ్వబోతోంది.