TRINETHRAM NEWS

Trinethram News : మేమంతా సిద్ధం బస్సు యాత్రతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఏపీ సీఎం జగన్. ఇడుపులపాయలో మొదలైన బస్సు యాత్ర నంద్యాల జిల్లా మీదుగా సాగుతోంది. ఇదిలా ఉంటే యాత్రలో సీఎం జగన్ ప్రజలను అప్యాయంగా కలుస్తున్నారు. వారి సమస్యలు గురించి తెలుసుకుంటున్నారు. ప్రభుత్వం అందించిన పథకాలు, కార్యక్రమాలతో లబ్ది పొందిన పలువురు.. ఈ సందర్భంగా సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు.

బస్సు యాత్ర పొడవునా సీఎం జగన్‌కు ప్రజలు ఘనస్వాగతం పలుకుతున్నారు. ప్రజలకు అభివాదం చేస్తూ యాత్రలో ముందుకు సాగుతున్నారు సీఎం జగన్. కొన్ని చోట్ల ప్రజలను కలుస్తున్న సీఎం జగన్ వారిని అప్యాయంగా పలకరిస్తున్నారు. సీఎం జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడుతున్నారు. వైసీపీ అధినేత సైతం చాలా చోట్ల తనను కలుస్తున్న వారితో సెల్ఫీలు దిగుతున్నారు. గత ఎన్నికలకు ముందు సుదీర్ఘ పాదయాత్ర చేపట్టారు వైఎస్‌ జగన్. ఆ సమయంలో ప్రజలతో ఎంతగానో మమేకమయ్యారు.

ప్రతి చోట ప్రజలను అప్యాయంగా పలకరించారు. పాదయాత్ర సమయంలో కొన్నాళ్లు ప్రజల్లోనే ఉన్న వైసీపీ అధినేత.. అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం పూర్తిగా పరిపాలన మీదే దృష్టిపెట్టారు. సమీక్షలు, సమావేశాలతో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు బహిరంగ సభల్లో పాల్గొన్నా.. కేవలం కొందరిని మాత్రమే కలిశారు. అయితే ఎన్నికల ప్రచారం కోసం మేమంతా సిద్ధం పేరుతో బస్సు యాత్ర చేపట్టిన సీఎం జగన్.. మరోసారి పూర్తిగా జనంతో మమేకమవుతున్నారు.

తనను కలిసేందుకు వచ్చిన వారిని గతంలో మాదిరిగానే అప్యాయంగా పలకరిస్తున్నారు. కొన్ని చోట్ల స్వయంగా తానే ప్రజల దగ్గరకు వెళ్లి వారితో మాట్లాడుతున్నారు. వారితో కలిసి సెల్ఫీలు దిగుతున్నారు. సీఎం జగన్‌ను చూసిన చాలామంది.. ఒకప్పుడు పాదయాత్రలో జగన్ తమను పలకరించిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ఇడుపులపాయలో మొదలైన సీఎం జగన్ బస్సుయాత్ర ఇచ్ఛాపురం వరకు కొనసాగనుంది. పేరుకు బస్సుయాత్రే అయినా… పాదయాత్ర తరహాలోనే చాలామందిని కలుస్తున్నారు వైఎస్ జగన్. మొత్తంగా ఈ యాత్ర ద్వారా మరోసారి ప్రజలకు తన పాదయాత్రను గుర్తు చేస్తున్నారు.