TRINETHRAM NEWS

రైల్వే శాఖ నుంచి భారీ నోటిఫికేషన్.. ఏకంగా 5,696 పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండి..

రైల్వే జాబ్‌ కోసం చాలా మంది కలలు కంటారు. ఏళ్లుగా కష్టపడుతూ నోటిఫికేషన్‌ ‍కోసం ఎదురుచూస్తుంటారు. అటువంటి ఆశలకు ఊతమిస్తూ భారత ‍ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వ శాఖ భారీ జాబ్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దానిలో వేల సంఖ్యలో ట్రైన్‌ డ్రైవర్‌ అంటే అసిస్టెంట్‌ లోకో పైలెట్‌(ఏఎల్‌పీ) పోస్టులను ప్రకటించింది.

అర్హత, ఆసక్తి ఉన్న వారు ఫిబ్రవరి 19వ తేదీలోపు ఆన్‌లైన్‌ విధానంలోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆర్‌ఆర్‌బీ ఏఎల్‌పీ నోటిఫికేషన్‌ 2024ను ఆర్‌ఆర్‌బీ అధికారిక వెబ్‌ సైట్లో చూడవచ్చు.

నోటిఫికేషన్‌ ఇది..
రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఏఎల్‌పీ నోటిఫికేషన్‌2024ను విడుదల చేసింది. దీనిలో ఏకంగా 5,696 అసిస్టెంట్‌ లోకో పైలెట్‌ పోస్టులను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అధికారిక నోటిఫికేషన్లో విద్యార్హతలు, దరఖాస్తు విధానం, జీతం, వయసు, దరఖాస్తు ఫీజు వంటివి వివరించింది. దీనికి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ జనవరి 20 నుంచే ప్రారంభమైంది.

అర్హతలు ఇవి..
ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానికల్‌, ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌, ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ విభాగంలో మూడేళ్ల డిప్లొమా చేసి ఉండాలి. లేదా ఏఐసీటీటీ గుర్తింపు ఉన్న ఏదైనా విద్యాంస్థ నుంచి పైన పేర్కొన్న బ్రాంచ్‌లలోనే ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు..
అభ్యర్థులు కనీసం 18ఏళ్లు నిండి ఉండాలి. 30 ఏళ్ల లోపు వారై ఉండాలి. అయితే కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులకు వయసు సడలింపు ఉంటుంది.

జీతం ఎంతంటే..
ఏఎల్‌పీకి ఎంపికైతే అటువంటి అభ్యర్థులకు ప్రారంభ వేతనం రూ. 19,900 ఉంటుంది. గరిష్టంగా రూ. 63,200 వరకూ పెరుగుతుంది.

దరఖాస్తు విధానం, ఫీజు..
ఏఎల్‌పీ పోస్టులకు దరఖాస్తుల ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జనవరి 20నుంచే ఆన్‌లైన్లో సైట్‌ ఓపెన్‌ అయ్యింది. ఫిబ్రవరి 19 వరకూ దరఖాస్తు చేసుకొనే వెసులుబాటు అభ్యర్థులకు ఉంది. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, ఎక్స్‌-సర్మీస్‌మెన్‌తోపాటు మహిళలకు రూ.250.. మిగిలిన వారికి రూ.500 చెల్లించాల్సి ఉంటుంది.

ఏయే బోర్డుల్లో ఖాళీలున్నాయంటే..
అహ్మదాబాద్‌, అజ్మీర్‌, అలహాబాద్‌, బెంగళూరు, భోపాల్‌, భువనేశ్వర్‌, బిలాస్‌పూర్‌, ఛండీగడ్‌, చెన్నై, గోరఖ్‌పూర్‌, గౌహతి, జమ్మూశ్రీనగన్‌, కోల్‌కతా, మాల్దా, ముంబై, ముజఫర్‌పూర్‌, పాట్నా, రాంచీ, సికింద్రాబాద్‌, సిలిగురి, తిరువనంతపురం.