జూన్ 26, 2026

WhatsApp Image 2024 12 05 at 21.56.50

TRINETHRAM NEWS

క్షమాపణ చెప్పడానికి సిద్ధం.. సీఎం సెన్సేషనల్ కామెంట్స్..

ఆరు గ్యారెంటీలలో భాగంగా డిసెంబర్ 9న ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని అమలు చేసామన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఆర్టీసీ కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. కేసీఆర్ ఆనాడు ఆర్టీసీ కార్మికులు చనిపోయినా పరామర్శించని పరిస్థితి లేదని విమర్శలు గుప్పించారు. ఈనాడు కీలకమైన అంశాలకు సంబంధించి సమస్యలను పరిష్కరించేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు.

11 నెలల 20 రోజుల్లో 115 కోట్ల మంది ఆడబిడ్డలు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని వినియోగించుకున్నారని తెలిపారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యంతో ప్రతీ ఆడబిడ్డ ప్రతీ నెలా 5 నుంచి 7 వేలు ఆదా చేయగలుగుతున్నారన్నారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్, ఆడబిడ్డలను రూ.500లకే గ్యాస్ సిలిండర్.. పథకాలను విజయవంతంగా అమలు చేస్తున్నట్లు వ్యాఖ్యానించారు. ప్రతీ నెలా ఒక కుటుంబానికి 10వేలు ప్రయోజనం పొందేలా పథకాల అమలు జరుగుతోందని వెల్లడించారు.

రాష్ట్రంలో 25లక్షల 35 వేల రైతు కుటుంబాలకు మొదటి ఏడాదిలోనే 21కోట్లతో రైతు రుణమాఫీ చేసినట్లు తెలిపారు. వరి వేసిన వారికి గిట్టుబాటు ధరతో పాటు సన్నాలకు రూ.500 బోనస్ అందిస్తున్నామన్నారు. 1కోటి 53 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండించి దేశంలోనే తెలంగాణ రికార్డు సృష్టించిందని తెలిపారు. దొడ్డు బియ్యం తినే పరిస్థితి లేదని.. అందుకే రైతులు సన్నాలు పండించండి అని కోరారు. అలా చేస్తే తెలంగాణలోని ప్రభుత్వ హాస్టళ్లలో, రేషన్ షాపుల్లో, మధ్యాహ్న భోజనాలకూ సన్నబియ్యం అందిస్తామన్నారు. ఈ నేలలో పండిన పంటనే మన బిడ్డలకు అందిస్తామన్నారు. బియ్యం రీసైక్లింగ్ మాఫియాను కూకటి వేళ్లతో పేకలిద్దామని అన్నారు.

నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్లు పారిపోతే.. కోర్టుల్లో కేసులు పరిష్కరించి మొదటి ఏడాదిలోనే 55,143 ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఏడాదిలోనే 55 వేల ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర ఉందా? అని ప్రశ్నించారు. ఏ లక్ష్యం కోసం అమరులు ప్రాణ త్యాగం చేశారో.. ఆ లక్ష్య సాధనలో భాగంగా తొలి ఏడాదిలోనే 55వేల ఉద్యోగ నియామకాలు చేపట్టామన్నారు. ఇందులో ఒక్క తల తగ్గినా తాను క్షమాపణ చెప్పడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

నగరంలో కాలుష్య నియంత్రణలో రవాణా శాఖది కీలక పాత్ర అన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు పెరగాల్సిన అవసరం ఉందని.. దీనిపై అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఉందని పేర్కొన్నారు. రాబోయే రెండేళ్లలో 3వేల ఎలక్ట్రిక్ బస్సులు కొని హైదరాబాద్ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడుతామన్నారు.

హైదరాబాద్ నగరంలో ఎలక్ట్రిక్ ఆటోలు నడుపుకునేందుకు ఎలాంటి ప్రోత్సాహకాలు ఇవ్వాలో ఒక ప్రణాళిక రూపొందించాలన్నారు. నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చాల్సిన బాధ్యత మనపై ఉందని.. మూసీకి గోదావరిని అనుసంధానం చేసి మూసీని అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. అవసరమైతే కొన్ని సార్లు కఠిన నిర్ణయాలు తీసుకునైనా సరే హైదరాబాద్ నగరంలో కాలుష్యాన్ని పారదోలుతామని వివరించారు. హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా నిలబెట్టేందుకు కృషి చేస్తామన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page