TRINETHRAM NEWS

Trinethram News : ప్రభుత్వం స్పందించకపోతే తగిన బుద్ధి చెబుతాం..

టీఏటీయూ నాయకుడు వేముల మారయ్య హెచ్చరిక

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం ఆటోబంద్‌ నిర్వహించనున్నట్టు టీఏటీయూ ఆటో యూనియన్‌ అధ్యక్షుడు వేముల మారయ్య తెలిపారు.

ఉప్పల్‌ మల్లాపూర్‌లో బుధవారం ఆయన ‘ఆటోబంద్‌’ వాల్‌పోస్టర్‌ను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటోడ్రైవర్లు జిల్లాల్లో ఎక్కడికక్కడ బంద్‌లో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తారని తెలిపారు. హైదరాబాద్‌లో 16న ఉదయం 10 గంటలకు సుందరయ్య విజ్ఞానకేంద్రం నుంచి నారాయణగూడ చౌరస్తా వరకు భారీ ఆటో ర్యాలీ నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. ఆటోడ్రైవర్లు అందరూ ఈ ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ర్యాలీని అడ్డుకోవాలని చూస్తే ప్రభుత్వానికి బుద్ధి చెప్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచితబస్సు పథకంలో ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ సమస్యలు పరిష్కరించకుంటే వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్తామని, అభ్యర్థుల ప్రచారాన్ని అడుగడుగునా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆటోలకు స్టిక్క ర్లు అంటించి బంద్‌లో పాల్గొనాలని సూచించారు. కార్యక్రమంలో శాతం రమేశ్‌,నిరంజన్‌,రామాంజనేయులు, సీహెచ్‌ సాయికుమార్‌, ఎర్రం శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.