TRINETHRAM NEWS

ఏసీబీ వలకు చిక్కిన అవినీతి ఎలక్ట్రికల్ చేప..

రైతు పొలంలో బోర్ కోసం లంచం డిమాండ్..

రూ 70 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎలక్ట్రికల్ సబ్ ఇంజనీర్ ప్రసాద్..

మండపేట

మారేడుబాక విద్యుత్ సబ్ స్టేషన్ లో పనిచేసే సబ్ ఇంజనీర్ ప్రసాద్ ఏసీబీ వలలో శుక్రవారం పట్టుబడ్డారు. అడిషనల్ ఎస్పీ సిహెచ్ సౌజన్య చెప్పిన కథనం ప్రకారం దుళ్ళ గ్రామానికి చెందిన ముల్లపూడి శ్రీనివాసరావు తన మామయ్య ముత్యాల గోపాలకృష్ణకు గ్రామంలో వ్యవసాయ భూమి ఉంది. నీటిపారుదల సౌకర్యం లేకపోవడంతో తన మామ పంట పొలంలో బోర్ వేయడానికి విద్యుత్ అధికారులను ఆశ్రయించారు. వీటికి సంబంధించిన ఎస్టిమేషన్ వేయడానికి దరఖాస్తు ప్రాసెస్ చేయడానికి సబ్ ఇంజనీర్ ప్రసాద్ 70000 రూపాయలు లంచం అడగడం జరిగింది. నెలలు గడుస్తున్న ఎస్టిమేషన్ స్లిప్ ఇవ్వకపోవడంతో ఈ విషయాన్ని రాజమండ్రి ఏసీబీ అధికారులకు రైతు శ్రీనివాస్ ఫిర్యాదు చేయడం జరిగింది. అడిషనల్ ఎస్పీ సౌజన్య పథకం ప్రకారం శుక్రవారం శుక్రవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు సబ్ స్టేషన్ వద్ద మాటు వేశారు. ముందుగా రూపొందించిన పథకం ప్రకారం ముళ్ళపూడి శ్రీనివాసరావు 70000 రూపాయల నగదు సబ్ స్టేషన్ లో ఉన్న సబ్ ఇంజనీర్ ప్రసాద్ కు అందజేశారు. వెంటనే ఆయన తన డైరీలో ఆ నగదు పెట్టుకోవడం జరిగింది. ఊహించని రీతిలో మెరుపు దాడి చేసిన అడిషనల్ ఎస్పీ సౌజన్య రెడ్ హ్యాండెడ్ గా లంచం తీసుకున్న ప్రసాద్ ను డబ్బుతో సహా పట్టివేశారు. ఈ సంఘటన మండపేటలో సంచలనం రేకెత్తించింది. ఈ సందర్భంగా అడిషనల్ ఎస్పీ సౌజన్య మాట్లాడుతూ ప్రజల పనులను అధికారులు డబ్బులు లేకుండా నిస్వార్ధంగా చేపట్టాలని ఈ విధంగా స్వార్థ బుద్ధితో లంచం తీసుకుంటే శిక్షకు గురవుతారని ఆమె హెచ్చరించారు. రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ కార్యాలయాలు అన్ని జిల్లాల్లో ఉన్నాయని ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి లంచం అడిగితే ముందుగా తమను ఆశ్రయించాలని ఆమె కోరారు. సబ్ ఇంజనీర్ ప్రసాద్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ ఏసీబీ దాడిలో ఇన్స్పెక్టర్లు వాసుకృష్ణ, సతీష్ , శ్రీనివాస్ ఎస్సై విల్సన్ ఏసీబీ సిబ్బంది ఉన్నారు.