
AI Screening : అల్లూరి సీతారామరాజు జిల్లా, జూన్ 3, (త్రినేత్రం న్యూస్): 0 నుంచి 6 సంవత్సరాల లోపు చిన్నారుల్లో ఆరోగ్య సమస్యలు, అభివృద్ధి లోపాలు మరియు వైకల్యాలను ముందస్తుగా గుర్తించేందుకు ఉద్దేశించిన “ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఎనేబుల్డ్ స్క్రీనింగ్” జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నిషాంతి.టి మంగళవారం ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ నిషాంతి మాట్లాడుతూ, ఆధునిక సాంకేతికత అయిన కృత్రిమ మేధస్సు (ఏఐ) సహాయంతో చిన్నారుల్లో ఉన్న ఆరోగ్య సమస్యలు, అభివృద్ధి లోపాలను ప్రారంభ దశలోనే గుర్తించడం సాధ్యమవుతుందని తెలిపారు. సకాలంలో వైద్య సేవలు అందించడం ద్వారా పిల్లలను వైకల్యాల బారిన పడకుండా కాపాడవచ్చన్నారు. మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ సిబ్బంది ఈ శిక్షణను పూర్తిగా సద్వినియోగం చేసుకుని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.
అలాగే తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాల్లో నమోదు చేసి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న “నవచేతన” కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా పిల్లల ఆరోగ్యం, పోషకాహారం, అభ్యాస సామర్థ్యాలు మరియు సమగ్ర అభివృద్ధికి అవసరమైన సేవలు అందించబడుతున్నాయని తెలిపారు.
జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ సాధికారత అధికారిణి సి.హెచ్. ఝాన్సీ మాట్లాడుతూ, ఈ శిక్షణా కార్యక్రమంలో సూపర్వైజర్లు, సీడీపీఓలు, వైద్య సిబ్బందికి ప్రత్యేక శిక్షణ అందిస్తున్నట్లు తెలిపారు. మండల స్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలకు ఈ నెల 5, 6, 8, 9 తేదీలలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ టి. ప్రతాప్, జీజీహెచ్ సైకియాట్రీ విభాగాధిపతి డాక్టర్ టి.ఎస్.ఎన్. రాజు, డీఈఐసీ పీడియాట్రీషియన్ డాక్టర్ శివకుమార్, జీజీహెచ్ పీడియాట్రిక్స్ విభాగాధిపతి డాక్టర్ చంద్రమోహన్, సీడీపీఓలు, వైద్యాధికారులు, సూపర్వైజర్లు తదితర అధికారులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe
