Minister Komatireddy : నేనే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ స్కూళ్లను మూసివేస్తా ’

TRINETHRAM NEWS

మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

నల్గొండలో అధునాతన పాఠశాల భవన ప్రారంభోత్సవం

నల్గొండలోని కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి. చిత్రంలో జిల్లా అధికారులు తదితరులు

Trinethram News : విద్యాహక్కు చట్టం ప్రకారం 25 శాతం సీట్లు పేదవారికి కల్పించాలని.. అయితే నిబంధనలకు విరుద్ధంగా కొన్ని కార్పొరేట్‌ సంస్థలు విద్యను వ్యాపారం చేస్తున్నాయని రాష్ట్ర రహదారులు, భవనాలు; సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు.

మంగళవారం నల్గొండ జిల్లాకేంద్రంలోని బొట్టుగూడ ప్రాంతంలో కోమటిరెడ్డి ప్రతీక్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాల భవన ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తన కుమారుడు, దివంగత ప్రతీక్‌రెడ్డి పేరిట ఏర్పాటైన ఫౌండేషన్‌ ఔదార్యంతో రూ.8 కోట్లతో సర్కారు బడిని కార్పొరేట్‌ హంగులతో నిర్మించడం ఆనందంగా ఉందన్నారు.

ప్రతిసారీ అడ్మిషన్ల సీజన్‌లో పేద, మధ్యతరగతి విద్యార్థుల తల్లిదండ్రులు వచ్చి ఫలానా పాఠశాలలో రుసుములు తగ్గించాలని కోరుతుంటారన్నారు. ఎల్‌కేజీ చదువులకు సైతం కొందరు రూ.లక్షల్లో వసూళ్లు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

తానే విద్యాశాఖ మంత్రినైతే కార్పొరేట్‌ విద్యాసంస్థలను మూసివేసి అందరూ ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే చదివేలా ఆదేశాలు జారీ చేస్తానని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సైతం కార్పొరేట్‌ విద్యాసంస్థల ప్రాధాన్యం తగ్గించాలనే ఉద్దేశంతోనే ప్రతి నియోజకవర్గంలో యంగ్‌ ఇండియా రెసిడెన్షియల్‌ పాఠశాలలను మంజూరు చేశారని గుర్తుచేశారు.

రూ.8 కోట్లతో అభివృద్ధి చేసిన పాఠశాల

2,500 చదరపు గజాల స్థలంలో కృత్యాధార (వాల్డార్ఫ్‌) బోధన పద్ధతిలో 4 అంతస్తులు, 40 విశాలమైన ఏసీ తరగతి గదులు, ఇండోర్‌ గేమ్స్‌ జోన్, కంప్యూటర్‌ ల్యాబ్స్, యోగా సెంటర్, లిఫ్ట్‌లు, గ్రంథాలయం, స్టెమ్‌ విద్య సౌకర్యాలు, స్మార్ట్‌ లెర్నింగ్‌ టూల్స్, డిజిటల్‌ తెరతో బోధన చేసేలా అన్ని వసతులు సమకూర్చామని మంత్రి వివరించారు.

వాల్డార్ఫ్‌ బోధన అంటే విద్యార్థులకు మూడు రకాలుగా.. ఆలోచన, భావన, కార్యాచరణ అనే పద్ధతులతో అనుభవాత్మక విద్యను అందించేలా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శంకర్‌నాయక్, జిల్లా కలెక్టర్‌ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్రపవార్, కాంగ్రెస్‌ నాయకులు బుర్రి శ్రీనివాస్‌రెడ్డి, గుమ్మల మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

If I were the Education Minister

You cannot copy content of this page

Scroll to Top