Maisamma Temple : మైసమ్మ ఆలయాన్ని కూల్చివేయకూడదు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా: ప్రతినిధి త్రినేత్రంన్యూస్. అభివృద్ధి పేరుతో మైసమ్మ ఆలయాన్ని కూల్చివేస్తామనడం సరైనది కాదని మోమిన్ పేట్ మండలం, ఎన్కతల గ్రామానికి చెందిన రైతులు మండిపడ్డారు. టీజీఐఐసీ అధికారులు కూల్చివేతకు సిద్ధమవగా సోమవారం రైతులు పనులను అడ్డుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామంలోని 198 సర్వే నెంబర్ ప్రభుత్వ భూమిలో అనాదిగా మైసమ్మ గుడి ఉందన్నారు. ఇక్కడ కొలువైన మైసమ్మ తల్లిని తరాలుగా కొలుస్తున్నట్లు తెలిపారు. ఇక్కడి భూమిని రైతులకు కేటాయించడంతో దశాబ్దాలుగా గ్రామ రైతులు సాగు చేసుకుంటున్నట్లు తెలిపారు. ఇటీవల పారిశ్రామిక అభివృద్ధి కోసం ఈ భూమిని ప్రభుత్వం సేకరించి టీజీఐఐసీకి అప్పగించిందన్నారు. కాగా పరిశ్రమల అభివృద్ధి కోసం పనులు చేపట్టారన్నారు.

ఇందులో భాగంగా మైసమ్మ గుడిని తొలగించేందుకు ఐఐసి అధికారులు సిద్ధమయ్యారని అన్నారు. తరాలుగా తాము కొలుస్తున్న అమ్మవారి గుడిని తొలగించడం సరైనది కాదని ఐఐసీ అధికారులకు తెలిపారు. పనులు నిలిపివేయవలసిందిగా డిమాండ్ చేశారు. దీంతో అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మోమిన్ పేట్ ఎస్ఐ అరవింద్ నేతృత్వంలో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు వర్గాలతో చర్చించి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కారం చేసుకోవాలని సూచించారు. అభివృద్ధిని గ్రామస్తులు అడ్డుకోకూడదని, ఇదే సమయంలో ప్రజల మనోభావాలను కూడా అధికారులు గౌరవించాలని ఎస్ఐ అరవింద్ అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Maisamma Temple Should Not Be Demolished

You cannot copy content of this page

Scroll to Top