Gold Mining in AP : ఏపీలో బంగారు గనుల తవ్వకం షురూ

TRINETHRAM NEWS

జొన్నగిరి గని నుంచి ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి!

దేశ బంగారం ఉత్పత్తి మ్యాప్‌లో చేరనున్న ఆంధ్రప్రదేశ్

కర్నూలు జిల్లా జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ గని సిద్ధం

దేశంలో బంగారం వెలికితీయనున్న తొలి ప్రైవేట్ కంపెనీగా రికార్డు

రాష్ట్ర ప్రభుత్వ అనుమతులు రాగానే ఉత్పత్తి ప్రారంభం

పసిడి దిగుమతుల భారం తగ్గే అవకాశం

Trinethram News : భారతదేశ బంగారం ఉత్పత్తి పటంలో ఆంధ్రప్రదేశ్‌ త్వరలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకోనుంది. కర్నూలు జిల్లాలోని జొన్నగిరిలో డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ (డీజీఎంఎల్) అభివృద్ధి చేసిన గని నుంచి త్వరలోనే పసిడి వెలికితీత ప్రారంభం కానుంది. ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చితే దేశంలో గనుల నుంచి బంగారం ఉత్పత్తి చేయనున్న తొలి ప్రైవేట్ రంగ సంస్థగా డెక్కన్ గోల్డ్ మైన్స్ చరిత్ర సృష్టించనుంది.

ఈ కీలక విషయాన్ని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ హనుమ ప్రసాద్ ఢిల్లీలో జరిగిన సీఐఐ సదస్సులో స్వయంగా వెల్లడించారు. జొన్నగిరి ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు ఈ ఏడాది జూన్-జులై నెలల్లోనే కేంద్రం నుంచి లభించాయని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరికొన్ని అనుమతులు రావాల్సి ఉందని, అవి కూడా పూర్తయితే వెంటనే ఉత్పత్తి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.

తమ అంచనాల ప్రకారం జొన్నగిరి గని నుంచి తొలినాళ్లలో ఏటా 750 కిలోల బంగారం ఉత్పత్తి చేయవచ్చని డీజీఎంఎల్ భావిస్తున్నట్లు ప్రసాద్ వివరించారు. రానున్న రెండు, మూడేళ్లలో ఈ ఉత్పత్తిని 1,000 కిలోల స్థాయికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

ప్రస్తుతం దేశంలో ఏటా కేవలం 1.5 టన్నుల బంగారం మాత్రమే ఉత్పత్తి అవుతోంది. దీంతో, ఏటా సుమారు 1,000 టన్నుల పసిడిని విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. దీనివల్ల భారీగా విదేశీ మారక ద్రవ్యం ఖర్చవుతోంది. ఈ నేపథ్యంలో జొన్నగిరిలో ఉత్పత్తి పూర్తి స్థాయిలో మొదలైతే, దేశీయంగా బంగారం లభ్యత పెరిగి దిగుమతుల భారం గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gold mining begins in AP

You cannot copy content of this page

Scroll to Top